అంతా ఆర్భాటమే | state government to implement the second phase... | Sakshi
Sakshi News home page

అంతా ఆర్భాటమే

Dec 6 2013 2:23 AM | Updated on Nov 9 2018 5:52 PM

రెండవ విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత హస్తం పథకం అమలులో ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి.

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: రెండవ విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు  చేస్తున్న  అమృత హస్తం పథకం అమలులో ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి తొలి విడతగా ప్రారంభించిన అమృత హస్తం పథకాన్ని  రెండో విడతగా ఈనెల 1వ తే దీ నుంచి అమలు చేస్తోంది.
 
 జిల్లాకు సంబంధించి తొలివిడతలో ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పోరుమామిళ్ల, బద్వేలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఈ పథకం అమలవుతుండగా రెండో విడతలో ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల ప్రాజెక్టులలో అమలు  చేస్తున్నారు.
 
 ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలోని ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, దువ్వూరు మండలాలలో 328 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.  తొలివిడతలో పలు రకాల సమస్యలు ఎదుర్కొన్న ఐసీడీఎస్ ఉన్నతాధికారులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే రెండో విడతగా పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకంకు సంబంధించి గత నెల 29న ముద్దనూరు సీడీపీఓ హైమావతి ముఖ్య అధికారులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా 30న ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని అమలు చేయడం తమ వల్ల కాదని ఈ సందర్భంగా కార్యకర్తలు  ముక్తకంఠంతో అధికారులకు విన్నవించారు. సమస్య తీవ్రతను గమనించకుండా  ఇది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెచ్చిన పథకమని అలా అనడానికి వీలులేదని అధికారులు వారి నోరు నొక్కి పంపారు. దీంతో ప్రస్తుతం సమస్యలు ఎదురవుతున్నాయి.
 
 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను కాదని పాలు, కూరగాయల సరఫరాను ఇందిరాక్రాంతి పథం పరిధిలోని మహిళా సమాఖ్యలకు అప్పగించారు.  ఇంత వరకు మహిళా సమాఖ్య ప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తమ అధికారులు  ఎవరూ  దీనిపై తమకు సమాచారం అందించలేదని వివేకానందనగర్‌కు చెందిన గ్రామ సమాఖ్య ప్రతినిధి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇదే విషయంపై ఏరియా కోఆర్డినేటర్ లావణ్య మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ నుంచి తమకు అమృత హస్తంపై ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.
 
 మార్కెట్‌లో లీటరు పాలధర రూ.44 ఉండగా ప్రభుత్వం రూ.28మాత్రమే చెల్లిస్తోంది. అలాగే కూరగాయలు సైతం కొనుగోలు చేయడానికి కార్యకర్తలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో  అమృత హస్తం పథకం ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు.  కాగా  అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులకు, బాలింతలకు రోజూ  గుడ్డును  ఉడికించి  వడ్డించాల్సి ఉండగా కాంట్రాక్టర్లు ఇంత వరకు సరఫరా చేయకపోవడం గమనార్హం. రెండు వారాలకోమారు కాంట్రాక్టర్లు తమకు గుడ్లు అందిస్తారని, ప్రస్తుతం ఇంకా అందించలేదని  కార్యకర్తలు తెలిపారు.
 
 ఇది ప్రొద్దుటూరు పరిధిలోని స్వరాజ్యనగర్ అంగన్‌వాడీ కేంద్రం.  అధికారుల ఆదేశాల మేరకు మొదటి రోజున గర్భిణీలు, బాలింతలకు 6 లీటర్ల పాలు కొనుగోలు చేశారు. దీంతోపాటు రోజూ కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.  భారం  పడుతుండటంతో  అంగన్‌వాడీ కార్యకర్త కాంతకుమారి పాల పంపిణీని నిలిపివేశారు. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.200 బాడుగను రూ.750కి పెంచగా ఇంత వరకు ఈ కేంద్రానికి  రూ.200 మాత్రమే చెల్లిస్తున్నారు. కొన్ని నెలలపాటు చేతి నుంచి అదనంగా ఖర్చు పెట్టి బాడుగ చెల్లించిన  కార్యకర్త ప్రస్తుతం ఆ ఇల్లు వర్షానికి కారుతుండటంతో తగిన ఇల్లు దొరకక ఇంటిలోనే అంగన్‌వాడీ కేంద్రాన్ని నడుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement