‘సొసైటీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం | 'Society' to prepare everything for polling | Sakshi
Sakshi News home page

‘సొసైటీ’ పోలింగ్‌కు సర్వం సిద్ధం

Jan 5 2014 2:11 AM | Updated on Aug 21 2018 7:53 PM

సహకార సొసైటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 సాక్షి,కడప;  సహకార సొసైటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు డివిజన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి తీసుకొని సొసైటీ ఎన్నికలు జరిగే ప్రదేశాలకు సోమవారం మధ్యాహ్నం నుంచే ఆర్టీసీ బస్సులలో సిబ్బంది తరలి వెళ్లారు. పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సిబ్బంది నియామకపు ఏర్పాట్లను జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, సహకార కళాశాల ప్రిన్సిపాల్ గుర్రప్ప, ఆడిట్ ఆఫీసర్ సుభాషిణి తదితరులు పరిశీలించారు.
 
 పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి గెలుపొందిన డెరైక్టర్ అభ్యర్థులను ప్రకటిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
 
 ఎన్నికలు జరిగే సొసైటీలివే..  
 జిల్లాలో ప్రస్తుతం 20 సొసైటీలకు ఎన్నికలు జరుగుతుండగా అనంతసముద్రం, అనంతయ్యగారిపల్లె, మద్దిరేవుల, గొర్లముదివీడు సొసైటీల్లో అన్ని డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 16 సొసైటీల్లోని 156 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నాగిరెడ్డిపల్లెలో 12, కె.అగ్రహారం 12, ఎల్లటూరు 13, వల్లూరు 12, గోనమాకులపల్లె 10, మన్నూరు 11, అల్లాడుపల్లె 9, టంగుటూరు 13, బి.కోడూరు 4, చెన్నకేశంపల్లె 3, పెనగలూరు 7, వీరబల్లి 13, కొలిమివాండ్లపల్లె 3, మట్లి 13, దిగువ గొట్టివీడు 8, నందలూరు 12 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణపల్లె సొసైటీకి సంబంధించి ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగనున్నాయి. అగ్రహారం, ఎల్లటూరు, వల్లూరు, టంగుటూరు, గోనమాకులపల్లె, బి.కోడూరు, చెన్నకేశంపల్లె సొసైటీలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement