అపహాస్యం పాలైన అమ్మ‘హస్తం’ | Six months 'ammahastam' review of how the distribution | Sakshi
Sakshi News home page

అపహాస్యం పాలైన అమ్మ‘హస్తం’

Oct 17 2013 12:55 AM | Updated on Sep 1 2017 11:41 PM

ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం అపహాస్యం పాలైంది.

 

=నాసిరకం సరుకులు మాకోద్దంటున్న పేదలు
=ఆరు నెలల ‘అమ్మహస్తం’ పంపిణీ తీరుపై సమీక్ష

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన   ‘అమ్మహస్తం’ పథకం అపహాస్యం పాలైంది.  జిల్లాలో ఈ పథకం  నిర్వీర్యమైపోయింది. ఆదినుంచే   అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న   ఈ పథకం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా...  నేటికి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యామైన నిత్యావసర సరుకులు  అందించాలన్న లక్ష్యం బెడిసికొట్టినట్లయింది.

సరుకుల నాణ్యత లేమీ,  బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సరుకుల ధరలో పెద్దగా తేడా కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కోల్పోయింది.  దీంతో పేదలు సరుకులు కొనుగోలు చేసేందుకు  అంతగా  ఆసక్తి చూపకపోవడంతో  సరఫరా   తగ్గుముఖం పట్టిందని అధికారులే చెబుతున్నారు.  జిల్లాలోని 11లక్షల 80వేల మంది కార్డుదారులకు 2,100  చౌకడిపోల ద్వారా వీటినిఅంటగట్టేందుకు అధికారులు నానా  అగచాట్లు పడుతున్నారు.   
 
నాణ్యతపై అనుమానాలు


 ‘అమ్మహస్తం’ పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందిపప్పు ఉడకటం లేదంటున్నారు. ఒక్కోసారి నిల్వ ఉన్న పప్పును సరఫరా చేస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. చింతపండు నల్లని రంగు ఉండి గింజలు అధికంగా ఉండటంతో అది నాసిరకమని భావిస్తున్నారు. గోధుమలు, గోధుమ పిండిలో పురుగులుంటున్నాయని వాపోతున్నారు.  ఘాటివ్వని కారం పోడి, రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు కంగుతింటున్నారు. కేవలం రూ.185 కే  తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న  మహిళలు ముక్కిపోయిన సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు.
 
తొమ్మిదింటిలో మూడే ..

 అమ్మహస్తం తొమ్మిది  సరుకుల్లో  వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.  కందిపప్పు,  చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా  ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు.

 ప్రచార అర్భాటమే....

 ‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరుకులుపై  ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న  సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం.  నెలసరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే .
 
వద్దు మొర్రో అంట్ను డీలర్లు ....

 రేషన్ డీలర్లు  తొమ్మిది సరుకుల పంపిణీపై అసక్తి చూపడం లేదు. ఇవన్నీ వద్దు మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. ప్రజలు పంచదార, నూనె నెలవారీ కొంటున్నారని, గోధుమలు, కందిపప్పు  కూడా అప్పుడప్పుడు కొంటున్నారని డీలర్లు చె బుతున్నారు.

 సరుకుల కోసం అదనపు పెట్టుబడి, కమీషన్ గిట్టుబాటుతో పాటు, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజవేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు.  పైగా సరుకుల దిగుమతి ఖర్చు,రవాణ అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు  ఉపాధికి గండిపడుతుందని  డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement