మూలిగే నక్కపై తాడి పండు పడ్డట్టు అంటే ఇదేనేమో. అసలే నిర్వహణభారం పెరిగి ఒకవైపు పరిశ్రమలు
పరిశ్రమలకు షాక్!
Apr 1 2016 12:42 AM | Updated on Sep 5 2018 3:44 PM
రెండుశాతం పెరగనున్న విద్యుత్చార్జీలు
పెంచిన ధరలు నేటినుంచీ అమలు
జిల్లాపై ఏడాదికి రూ. 3.61 కోట్ల అదనపు భారం
ఆందోళనలో పారిశ్రామిక రంగం
విజయనగరం మున్సిపాలిటీ : మూలిగే నక్కపై తాడి పండు పడ్డట్టు అంటే ఇదేనేమో. అసలే నిర్వహణభారం పెరిగి ఒకవైపు పరిశ్రమలు మూతపడుతుంటే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో హైఓల్టేజీ షాక్ ఇచ్చింది. కమర్షియల్ కేటగిరీలకు చెందిన సర్వీసులపైనా భారం మోపింది. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 2 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రతిపాదించిన ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది. పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ ఒకటినుంచి అమల్లోకి రానుండగా... హైఓల్టేజీ కనెక్షన్లపై ఆర్ధిక భారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు ఎటువంటి చార్జీలు పెంచకున్నా గృహేతర వినియోగదారులపై భారానికి పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న 6,43,350 వినియోగదారులపై ఏడాదికి అదనంగా రూ3.61 కోట్లు భారం పడుతుంది.
కష్టాల్లో పారిశ్రామిక రంగం
వెనుక బడిన ప్రాంతంగా పేరొందిన విజయనగరం జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచేయడంతో పరిశ్రమల నిర్వహణ కష్టతరంగా మారుతోందంటూ సంబంధిత యాజమాన్యాలు లాకౌట్ ప్రకటిస్తున్నాయి. జిల్లాలో పరిశీలిస్తే ఇప్పటి వరకు 10 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు, 8 జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఆయా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న సుమారు 20వేల కార్మికులకు చెందిన 80వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
కొన్నేళ్లుగా మూతపడి ఉన్న ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తారని ఇప్పటివరకూ ఆశించినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక రంగానికి చేయూతనిస్తామనీ, యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సహకారం అందిస్తామని చెప్పి... ఇప్పుడు 2016-17 సంవత్సరానికి హైఓల్టేజీ విద్యుత్ కనెక్షన్ల యూనిట్ ధరను పెంచటంతో ఆ రంగం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకునే పరిస్థి దాపురించింది.
Advertisement


