పొదుపు.. అభివృద్ధికి మలుపు | savings are stepping towards development | Sakshi
Sakshi News home page

పొదుపు.. అభివృద్ధికి మలుపు

Sep 13 2013 3:28 AM | Updated on Sep 1 2017 10:39 PM

పొదుపు చేయడం ఆర్థిక అభివృద్ధికి మలుపు అని ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల పనితీరు భేష్ అని కొనియాడింది.


 ఓర్వకల్లు రూరల్, న్యూస్‌లైన్:
 పొదుపు చేయడం ఆర్థిక అభివృద్ధికి మలుపు అని ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల పనితీరు భేష్ అని కొనియాడింది. గురువారం ఓర్వకల్లు మండలం హుసేనాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును 12 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. బృందంలో ఓరోసులిస్టాని, రాపిగ్రాతు, జార్జ్‌స్పరయా, సిద్దిక్ ప్రేమనా, డినేసిసింద్రా, రాపికేహబి, ఆరిఫ్, పూర్ణిమా, సూర్యపత్రిమా, జాకీ బాయరాయి ఉన్నారు. వారి వెంట పీఎన్‌ఆర్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ శ్రీధర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వారు పొదుపు మహిళలు బ్యాంకుల ద్వారా లబ్ధి పొందిన విధానాన్ని, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు.
 
 ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రంగన్న మాట్లాడుతూ కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 5,300 మంది పొదుపు గ్రూపు సంఘాలకు రుణాలు ఇచ్చామన్నారు. ఏటా జూన్‌లో రుణాలు వసూలు చేస్తామన్నారు. ఒక్కో గ్రూపునకు రూ. 5 లక్షలు నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఆ డబ్బుతో సభ్యులు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు.  బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లిస్తురని చెప్పారు. పొదుపునకు సంబంధించిన అనేక అంశాలను మీరా గ్రూపునకు చెందిన లీడర్ పద్మావతితో బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పొదుపు సంఘాలు లేనప్పుడు, ఏర్పడ్డాక ఎలా ఉందని బృందం సభ్యులు ప్రశ్నించారు. సంఘాలు లేనప్పుడు అప్పులు దొరికేవి కావని, సంఘాలు ఏర్పడిన తర్వాత తాము ఎంతో అభివృద్ధి చెందామని వారికి వివరించారు.
 
 పొదుపుతో ఆర్థిక అభివృద్ధి:
 డీఆర్‌డీఏ పీడీ నజీర్‌అహ్మద్ మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు వ్యాపారాలు, భూమి కొనుగోళ్లు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందారని బృందానికి వివరించారు. హుసేనాపురం ఆంధ్రప్రగతి బ్యాంకు మేనేజర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 250 పొదుపు సంఘాలకు రూ. 4.50 కోట్ల రుణాలు, 1500 మంది రైతులకు రూ. 9 కోట్ల వరకు పంట రుణాలు ఇచ్చామన్నారు. అనంతరం పొదుపు మహిళలతో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు మాట్లాడారు. పొదుపు ద్వారా పేదరికాన్ని జయించి ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించారు. సంఘాల పనితీరును తాముఆదర్శంగా తీసుకుంటామన్నారు.  ఆంధ్రప్రగతి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పూర్ణ పుష్కల, ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్‌ఆచారి, అకౌంటెంట్ జ్యోతిర్మయి, ఆర్‌ఓ క్రెడిట్ మేనేజర్ రమణారెడ్డి, నాబార్డు ఏజీఎం కల్యాణ సుందరం పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement