ఆయన రూమ్‌కు వెళ్తేనే హాజరేస్తాడట!

Sanitary Inspector Sexual harassment on Female workers - Sakshi - Sakshi

వెళ్లకుంటే విధులకు హాజరు కానట్లేనట..

మహిళా పారిశుద్ధ్య కార్మికులకు లైంగిక వేధింపులు

కందుకూరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆర్డీఓకు ఫిర్యాదు

కందుకూరు: మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కొండయ్య లైంగిక వేధింపులు భరించలేకపోతున్నామని పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆర్డీఓ మల్లిఖార్జున ఎదుట వాపోయారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఆయన్ను కలిసి ఫిర్యాదు చేశారు. గిట్టని మహిళలు, చెప్పినట్టు వినని మహిళలను లక్ష్యంగా చేసుకుని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వేధిస్తున్నాడని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తన గదికి రావాలంటూ తరుచూ బలవంతం చేస్తున్నాడని, వెళ్లకుంటే మస్టర్‌ వేయకుండా పనికి రానట్టు నమోదు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర కార్మికుల వద్ద చులకనగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని వాపోయారు. 

దీనిపై గతంలోనే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఆయన వేధింపులు మాత్రం ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. స్పందించిన ఆర్డీఓ..పద్ధతి మార్చుకోవాలని గతంలోనే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను హెచ్చరించానని, మార్పు రాకుంటే ప్రభుత్వానికి ఆయన్ను సరెండర్‌ చేస్తానని హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విచారిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది కార్మికులకు తెలియజేస్తామని, ఆ రోజు వచ్చి తమ ఇబ్బందులు చెప్పాలని ఆర్డీఓ కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, జాజుల కోటేశ్వరరావు, పిడికిటి శంకర్, ఫకృద్దీన్‌ ఆలీ అహ్మద్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top