జనాభిమతాన్ని పరిగణించకుండా, ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయంపై సీమాంధ్ర జనం ఆగ్రహం జ్వాలాతోరణమై అరవై రోజులైంది. ఢిల్లీ పెద్దల దాష్టీకంపై ఊరూవాడా రణరంగమై అరవై రోజులైంది. అయితేనేం- తెలుగుజాతిని నిలువునా చీల్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ తమ సమరం ఆగబోదని అన్ని వర్గాలూ ఒకే గొంతుగా నినదిస్తున్నాయి. క్యాలెండర్లో మరో పేజీ తిరగబోతున్నా, జీతభత్యాలు లేక యాతనలు ఎదురవుతున్నా.. సమైక్యాంధ్రను పరిరక్షించాలన్న తమ సంకల్పం సడలబోదని ఉద్యోగవర్గాలు పోరుబాటలో సాగుతూనే ఉన్నాయి.
సాక్షి, రాజమండ్రి : మరో రెండురోజుల్లో మరో నెల గతించనుంది. అయితేనేం.. రెండు నెలల క్రితం జూలై 31న రగులుకున్న ధర్మాగ్రహజ్వాల రోజురోజుకూ జ్వాజ్వల్యమానమవుతూనే ఉంది. ‘తారీఖులు, తరలే నెలలు.. కావేవీ మా పోరుకు అడ్డం- తెలుగుజాతి సమైక్యతా పరిరక్షణే మా అంతిమ లక్ష్యం’ అంటూ సీమాంధ్ర ప్రాంతంలో ఊరూరా, వాడవాడనా ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిస్తూనే ఉన్నారు. సమైక్య సమరంలో భాగంగా 60వ రోజైన శనివారం జిల్లాలో సమైక్యవాదులు విభజన నిర్ణయం పట్ల తమ నిరసనను వివిధ రూపాల్లో చాటారు.
సమైక్య ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో గ్రామంలో సమైక్య ప్రార్థనలు చేస్తున్న రావులపాలెంకు చెందిన షకీనా మినిస్ట్రీస్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సోనియాకు సైతాన్ పట్టినందునే రాష్ట్రాన్ని ముక్కలు చేయజూస్తున్నారని, ఆ సైతాన్ వదిలి పోవాలని ప్రార్థనలు జరిపారు. ఉద్యమం 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద దీక్షల్లో 60 మంది పాల్గొన్నారు. హరికథా కాలక్షే పంతో పాటు అల్లూరి సీతారామరాజు వేషధారణతో ప్రదర్శన చేశారు. ఏలేశ్వరంలో సమైక్యవాదులు 60 ఆకృతిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాజానగరం పాతబస్టాండ్ సెంటర్ వద్ద దీక్షాశిబిరంలో ‘హ్యూమన్ హెల్పింగ్ హ్యాండ్స్’ అనే సేవా సంస్థ 60 ఏళ్ల వృద్ధుడిని సన్మానించింది.
బజ్జీలు, టీలు విక్రయించిన ఉపాధ్యాయులు
రాజమండ్రి మోరంపూడి జంక్షన్, కడియం మండలం వేమగిరి సెంటర్లలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మంత్రి పితాని సత్యనారాయణ కాన్వాయ్ను అడ్డుకుని ఘెరావ్ చేశారు. తక్షణం
రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని మంత్రి చెప్పడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు ‘రాజీనామా చేశానని మీకు మీరు అనుకుంటే సరిపోదు, దాన్ని ఆమోదింప చేసుకోవా’లని డిమాండ్ చేశారు. దానికి మంత్రి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బజ్టీలు, టీలు విక్రయించారు. రాష్ట్రం విడిపోతే తమకు ఇదే గతి అంటూ సందేశం ఇచ్చారు.
హర్షవర్థన పాఠశాల విద్యార్థులు రైల్వే స్టేషన్ రోడ్డులో రాస్తారోకో చేశారు.
కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో దిగ్విజయ్సింగ్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి కలెక్టరేట్ ఎదుట దహనం చేశారు. గృహనిర్మాణ శాఖ ఉద్యోగులు గిరిజనులతో సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శింపజేశారు. 300 అడుగుల పొడవున ఉన్న జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. కాపు సద్భావనా సంఘం ఆధ్వర్యంలో నాగమల్లితోటలో వంటా వార్పు చేశారు. ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఉద్యోగులు దస్తావేజు పేపర్లపై సమైక్య నినాదాలు రాసి ప్రదర్శించారు.
కోనసీమలో..
అమలాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి ఇళ్లు, దుకాణాల వద్ద జోలె పట్టి భిక్షాటన చేశారు. కార్లు, మోటారు సైకిళ్లు తుడిచి నిరసన తెలిపారు. కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. సిద్ధి వినాయక మోటార్ మెకానిక్స్ అసోసియేషన్ మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించింది. అల్లవరంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. కోనసీమ రైతు జేఏసీ ఆధ్వర్యంలో మండల సమైక్యాంధ్ర రైతు జేఏసీని ఏర్పాటు చేశారు. ముమ్మిడివరంలో తహశీల్దారు కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పువ్వులు పంచి సమ్మెలోకి ఆహ్వానించారు.
కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్లో జేఏసీ నేత లు విద్యార్థులకు సమైక్యాంధ్ర ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందచేశారు. అంబాజీపేటలో రాట్నాలతో దేవాంగులు రోడ్డుపైనే నేత నేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఉద్యోగుల జేఏసీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది. పి.గన్నవరంలో నిరవధిక దీక్షల్ల్లో భాగంగా ఉద్యోగులు, రాజకీయ జేఏసీ సభ్యులు పోరు నిద్ర చేపట్టారు. అయినవిల్లి మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ముక్తేశ్వరం సెంటర్ వరకూ దింపు కార్మికులు మోకులు కట్టుకుని ర్యాలీ చేశారు. మామిడికుదురులో ఉద్యోగులు జాతీయ రహదారిపై దుస్తులు ఉతుకుతూ నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకుని దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసరు డాక్టర్ సీవీ కృష్ణారావు ఆర్ఆర్జీహెచ్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిలబడి నిరసన తెలిపారు.
తాండవ నదిలో జలదీక్ష
సామర్లకోటలో మహిళలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ స్థానికులకు మెహెందీ పెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా మెహెందీ పెట్టించుకున్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తుని వద్ద తాండవ నదిలో జలదీక్ష చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకూ నదిలో నిలుచుని సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏలేశ్వరంలో సత్యదేవా టెంట్ హౌస్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 50 వాహనాల్లో భారీ ర్యాలీ చేశారు. బాలాజీచౌక్ వద్ద వలయంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
మలికిపురంలో మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. జగ్గంపేటలో సమైక్యవాది ఒమ్మి రఘురాం చేపట్టిన 48 గంటల దీక్షను పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ విరమింప చేశారు. ద్రాక్షారామలో జేఏసీ దీక్షలకు పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్చంద్రబోస్ సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 42వ రోజుకు చేరాయి. పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు లింగంపర్తిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డప్పుకొడుతూ సమైక్య నినాదాలు చేశారు. కోరుకొండ మండలం నిడిగట్లలో పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.
ఆ సంప్రదాయాలు మనవి కూడా..
గండేపల్లిలో జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో చేశారు. చిన్నారులకు సమ్మక్క, సారక్క వేషాలు వేసి ఆ దేవతలు సమైక్యాంధ్రులు ఆరాధించే మాత ప్రతిరూపాలేనని చాటి చెప్పారు. రోడ్డుపై ఆటపాటలతో నిరసన తెలిపారు. రామచంద్రపురం ప్రధాన రహదారిలో మహిళలు బతుకమ్మ పండగ జరిపి, ఆ సంప్రదాయం కేవలం తెలంగాణదే కాదు రాష్ట్రం మొత్తానికి చెందినదని చాటి చెప్పారు. రాజానగరం మండలం రాధేయపాలెం, పాతతుంగపాడు గ్రామాల్లో జేఏసీ ఆధ్వర్యలో ఇంటింటా సమైక్య జెండాలను ఆవిష్కరించారు. రామచంద్రపురంలో అంగన్వాడీ ఉద్యోగుల పిల్లలతో సమైక్య చిన్నారి గర్జన నిర్వహించారు. చిన్నారులు దేశ నాయకుల వేషాలు వేసి సమైక్యంగా ఉండాలంటూ ఉద్బోధించారు. పట్టణ ప్రధాన రహదారిలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. కె.గంగవరం, ద్రాక్షారామల్లో ఉపాధ్యాయలు అర్ధనగ్నంగా మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు.