అమ్మకానికి అడవి | Sale of forest | Sakshi
Sakshi News home page

అమ్మకానికి అడవి

Sep 26 2013 1:26 AM | Updated on Oct 9 2018 4:55 PM

అటవీశాఖలో అవినీతి పేట్రేగుతోంది. బతుకు తెరువు కోసం మామిడి మొక్కలు నాటిన పేదలపై జులుం ప్రదర్శించే ఫారెస్టు అధికారులు పెద్దలకు దాసోహమంటున్నారు.

అటవీశాఖలో అవినీతి పేట్రేగుతోంది. బతుకు తెరువు కోసం మామిడి మొక్కలు నాటిన పేదలపై జులుం ప్రదర్శించే ఫారెస్టు అధికారులు పెద్దలకు దాసోహమంటున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ను రియల్ ఎస్టేట్ ప్లాట్లలా ఆ శాఖ ఉద్యోగే విక్రయిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందన్న భావనతో కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నవారినీ వదిలిపెట్టకుండా మామూళ్ల దందాతో వేధిస్తున్నారు.
 
 పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : జిల్లా అటవీశాఖకు డబ్బు జబ్బు పట్టింది. ఏం చేసినా అడిగేవాడు లేడనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జీవనాధారం కోసం పేదలు మామిడి మొక్కలు వేసుకుంటే జులుం ప్రదర్శించి వాటిని పీకేసే ఫారెస్టు అధికారులు నగరం సమీపంలోని అటవీభూముల్ని పెద్దలకు దోచిపెడుతున్నారు. గతంలో నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో వేలాది ఎకరాలను పెద్దల పరం చేసిన ఈ అధికారులు ఇప్పుడు కొత్తూరు రిజర్వుఫారెస్ట్‌ను బడాబాబులకు బేరం పెట్టారు. కొత్తూరులో 2,300 ఎకరాల అటవీభూమి ఉంది. దీని పరిధిలోని అంబాపురం అటవీప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమణకు గురైంది.

గుడిసెలతో మొదలయ్యే ఆక్రమణల కథ పక్కా బంగ్లాల నిర్మాణం వరకు కొనసాగుతోంది. ఇందులో ప్రధాన సూత్రదారులు అటవీశాఖ అధికారులే కావడం చర్చనీయాంశమైంది. రెండు వందల గజాల స్థలాన్ని రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారని సమాచారం. ఈ సొమ్ము ఆ శాఖలో కిందనుంచి పైస్థాయి వరకూ ఎవరి వాటా వారికి అందుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నెండేళ్లగా సెక్షన్లు మారుతూ విజయవాడ రేంజ్‌లోనే తిష్టవేసిన ఓ ఉద్యోగే అటవీ భూముల విక్రయ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా తారుమారు చేశారనే అభియోగాలు ఉన్నాయి.

 నివాసితులకూ తప్పని తిప్పలు

 అంబపురం అటవీ భూముల ఆక్రమణ పర్వం 2011లో మొదలై ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. రియల్ ఎస్టేట్ వెంచర్లను తలదన్నే రీతిలో ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం అంతా బ్రోకర్ల ద్వారా ఈ ఉద్యోగే నడుపుతున్నారు. ముందుగా పాక, ఆ తర్వాత ఓ మోస్తరు ఇల్లు, చివరకు పక్కా బిల్డింగ్ వెలుస్తుంది.

‘విజయవాడకు సమీపంలో గజం వెయ్యి రూపాయలకు దొరకడం మామూలు విషయం కాదు. మీరు ఇల్లు కట్టుకున్నాక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కావాలంటే చూడండి.. చాలా ఇళ్లే ఉన్నాయ’ంటూ బ్రోకర్లు మాయమాటలు చెప్పి పార్టీలను ముగ్గులోకి దించుతారు. తక్కువ రేటుకు వస్తుందని ఆశపడినవారు సొమ్ము ముట్టజెప్పి ఇల్లు కట్టుకుంటే.. ఆ తరువాత ఫారెస్టు అధికారులు మరో కొత్త డ్రామాకు తెరతీస్తారు. డీఎఫ్‌ఓ, కన్జర్వేటర్, విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారంటూ బెదిరిస్తూ నివాసితుల నుంచి మరింత పిండుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బు ఇచ్చేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారికి వేధింపులు తప్పడంలేదు.

 అటకెక్కిన సస్పెన్షన్

 ఆక్రమణల్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలపై ఉద్యోగిని 27 నవంబర్ 2012న నాటి డీఎఫ్‌ఓ హరిబాబు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత రెండు రోజునే ఆయన బదిలీ అయ్యారు. కొందరు జిల్లాస్థాయి అధికారుల అండదండలతో ఉన్నతాధికారుల్ని మేనేజ్ చేసి ఆ ఉద్యోగి సస్పెన్షన్ ఫైల్‌ను నిలుపుదల చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటవీప్రాంత హద్దుల్ని నిర్ణయించే కేరిన్‌ల(అడవి హద్దులు) ఏర్పాటులోనూ ఉద్యోగి మాయచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. జనకమ్మ కుంట ప్రాంతంలో నిర్మించిన 100 కేరిన్‌లలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఇందుకోసం వాచర్‌ను మేనేజ్‌చేసినట్లు భోగట్టా. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహిస్తే అంబపురం అటవీప్రాంతంలో చోటుచేసుకున్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

 పేదలపై ప్రతాపం

 నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో పేదలు ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్న మామిడి మొక్కల్ని అధికారులు అడ్డంగా నరికేశారు. చాట్రాయి మండలం సోమవరం గ్రామం, నూజివీడు మండలం బత్తులవారిగూడెం, ముసునూరు మండలం రమణక్కపేట, బలివే వెంకటాపురం గ్రామాల్లో పేదలు వేసిన మామిడి మొక్కలను పీకేశారు. ఎన్నో ఏళ్ళుగా అటవీ భూముల్ని ఆక్రమించుకొని బడాబాబులు సాగిస్తున్న  కార్పొరేట్ వ్యవసాయం వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. తాజాగా విజయవాడలోని ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ 50 ఎకరాల అటవీభూమిని ఆక్రమించినట్లు సమాచారం. ఇందుకు భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. భూముల ధరలు అనూహ్యంగా పెరుగుతున్న దృష్ట్యా విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన కొందరు బడాబాబులు అటవీభూముల్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో అవినీతి అధికారులకు కాసుల పంట పండుతోంది.

 విచారణ నిర్వహిస్తాం
 అంబపురం అటవీభూమి ఆక్రమణకు గురైందని నాకు తెలియదు. విచారణ నిర్వహిస్తా. ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటా. గతంలో ఉద్యోగి సస్పెన్షన్ అయిన విషయమూ నాకు తెలియదు. నేను విధులు చేపట్టి మూడు నెలలే అయింది. కేరిన్‌ల ఏర్పాటులో అవకతవకలు జరిగే అస్కారం ఉండదు. అయినా పరిశీలిస్తా.
 - రాజశేఖర్, అటవీశాఖ జిల్లా అధికారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement