సైనికుడా సలాం | Salam soldiers | Sakshi
Sakshi News home page

సైనికుడా సలాం

Jan 14 2014 3:09 AM | Updated on Apr 7 2019 4:36 PM

చీకటి పడిదంటే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడతాం. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే అమ్మో..? అనుకుంటూ దాక్కుంటాం.. అలాంటిది ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి..

చీకటి పడిదంటే చాలు బయటకు వెళ్లాలంటేనే భయపడతాం. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే అమ్మో..? అనుకుంటూ దాక్కుంటాం.. అలాంటిది ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి.. అపరాత్రి తేడాలేకుండా.. భుజానికి తుపాకులు.. బరువైన బ్యాగులతో దేశ సరిహద్దులో కాపలా కాస్తూ.. ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో శుత్రువుల బారి నుంచి మనలను రక్షిస్తున్నారు సైనికులు. దేశం కోసం రక్తమైనా ఇస్తాం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. దేశం మట్టి మాత్రం ఇవ్వమంటూ ప్రతినబూని సరిహద్దులో దూసుకుపోతున్నారు జిల్లా యువకులు. కన్నవారికి.. కట్టుకున్నవారికి దూరంగా ఉంటున్నా.. దేశం కోసం పనిచేస్తున్నామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏటా జనవరి 15న భారత సైనిక దినోత్సవం జరుపుకుంటున్నారు.                      
    - న్యూస్‌లైన్, కోల్‌సిటీ/ధర్మపురి
 
    యువతలో పెరుగుతున్న తపన
 దేశం కోసం బార్డర్‌లో సేవలందించాలనే తపన నేటి యువతలో ఎక్కువగా పెరుగుతోంది. ఎల్-70 బోఫోర్స్‌గన్, ఏకే-47, ఏకే-57, ఇన్‌సాస్‌గన్, లైట్‌మిషన్‌గన్, ఎల్‌ఎంజీ తుపాకులు, రాకెట్ లాంచర్లు, ఎక్స్-95, ఎంఎంజీతో శత్రువులను మట్టుపెట్టడానికి యువత ముందుకొస్తున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ కొండలు, నదులు దాటుతూ.. కనీసం తాగడానికి నీళ్లు దొరకని ప్రాంతాల్లోనూ రోజుల తరబడి దేశ రక్షణకు శ్రమిస్తున్నారు.
 
 జిల్లా నుంచి ఆర్మీకి
 ‘ఖని’ యువకులే అధికం
 జిల్లా నుంచి ఆర్మీలోకి చేరుతున్నవారిలో రామగుండం ప్రాంతానికి చెందినవారే ఎక్కువగా ఉంటున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయిన తర్వాత యాజమాన్యం, ఉద్యోగుల పిల్లలను దేశరక్షణ కోసం ఆర్మీలో సిపాయిలుగా మార్చడానికి ఉచితంగా శిక్షణ ఇస్తూ కృషి చేస్తోంది. ఏటా నిర్వహించే రిక్రూట్‌మెంట్‌కు సింగరేణి వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికిపైగా యువకులు పోటీపడుతున్నారు. రామగుండం రీజియన్ నుంచే కనీసం వంద మంది యువకు లు ఆర్మీలో చేరుతున్నారు. ఇప్పటికే సుమారు మూడు వేలకు పైగా సింగరేణి కార్మికుల బిడ్డలు సిపాయిలుగా దేశాన్ని కాపలా కాస్తున్నారు.
 
 ఉద్యోగంలో ఆరుగురు.. శిక్షణలో ఒకరు..
 పాసిగామలో ఆరుగురు యువకులు ఆర్మీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, లక్నో, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో యువ జవాన్లు సేవలు అందిస్తున్నారు. ఇందులో గోపతి కిషన్, అత్తె రవీందర్, సిరిపురం శంకరయ్య, ఉపారపు రమేశ్, అత్తె రవీందర్, అత్తె రవి ఉన్నారు. కొట్టె తిరుపతి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. పాసిగామతోపాటు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రామెల్ల గంగయ్య, రాయపట్నం గ్రామానికి చెందిన బుద్దె వెంకటేశ్, నాగారం గ్రామానికి చెందిన మరో యువకుడు ఆర్మీలో సేవలు అందిస్తున్నారు.
 
 మా ఇద్దరు కొడుకులూ ఆర్మీలోనే..
 మా ఇద్దరు కొడుకులు అబ్దుల్ హాకీం (28), అబ్దుల్ అలీం (26) దేశం రక్షణ కోసం బార్డర్‌లో కాపలా కాస్తున్నారు. అంతకంటే ఏం కావాలి మాకు. ‘సింగరేణిలో చనిపోతే ఏం వస్తది డాడీ... ఆర్మీగా వీరమణం పొందితే ఢిల్లీలో జెండా కప్పుతరు.. అప్పుడు గర్వపడండి...’ అని నా బిడ్డలు ధైర్మం చెప్పి ఆర్మీలో చేరిండ్లు. నేను 11వ గనిలో ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్‌గా పని చేస్తున్న. నా సేవలను గుర్తించి సింగరేణి యాజమాన్యం ఇప్పటికి రెండుసార్లు ఉత్తమ ఉద్యోగిగా సన్మానించిం ది. మాకు ముగ్గురు కొడుకులు, కూతురు సంతానం.
 
 పెద్ద కొడుకు ప్రైవేట్ స్కూల్ టీచర్. రెండో కొడుకు అబ్దు ల్ హాకీం తొమ్మిదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు భోపాల్‌లో డ్రైవర్‌గా సేవలందిస్తున్నాడు. చిన్న కొడు కు అబ్దుల్ అలీం ఏడేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం నేషనల్ స్పెషల్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో బాక్ల్ కమాండో గా దేశానికి కాపలాగా ఉంటున్నాడు. ఇద్దరూ సింగరేణి సేవా సమితి ద్వారానే ఆర్మీలో చేరారు. బిడ్డలిద్దరూ ఆర్మీలో పని చేస్తున్నారంటే గర్వంగా ఉంది. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకులను చూడకుండా నా భార్య ఉండకున్నా.. దేశం కోసం కన్న ప్రేమను కడుపులో దాచుకుంటోంది.           
 - అబ్దుల్ రజాక్, రబియా బేగం, గోదావరిఖని
 
  సిపాయిగా చూడాలని
 మా ఊరి నుంచి పొలగాండ్లు మిలి టిరీల చేరిండ్రు. దేశసేవ సేత్తం డ్రు. మా కొడుకు తిరుపతి కూడా మిలిటిరీ చేర్పించినం. మేం కూలీ నాలీ చేసుకుంటన్నం. మా కొడుకును సిపాయిగా చూడాలనే అక్కడికి పంపిం చినం. ఇప్పుడు హైద్రబాద్ల శిక్షణ పొందుతండు.      
 - లింగయ్య, లక్ష్మి
 (తిరుపతి తల్లిదండ్రులు)
 
  జన్మభూమి కోసం
 నా జన్మభూమి కోసం ఆర్మీల చేరిన, దేశ రక్షణ కోసం లాంటి కష్టాలనైనా ఎదుర్కొంట. నాతల్లిదండ్రులు సత్తమ్మ, మల్లేశం. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నరు. వాళ్లు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నరు. నేను మధ్యప్రదేశ్‌లో శిక్షణ పొందిన. గుజరాత్‌లో పనిచేస్తున్న.
 - రవీందర్, పాసిగామ
 
  ఆర్మీయే నా జీవితం
 ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనేది నా జీవిత లక్ష్యం. అందుకోసమే నేను ఉద్యోగంలో చేరిన. పద్మ- మల్లేశం మా అమ్మానాన్నలు. ఒక సోదరి, సోదరుడు ఉన్నరు. నేను డిగ్రీ వరకు చదివిన. సైన్యంలో చేరిన. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న.
 - అత్తె రవి, పాసిగామ
 
  డిగ్రీ చదివిన
 సిపాయిగా పనిచేయడం ఎంతో సంతోషంగాఉంది. నా జన్మ భూమి కోసం, నా ప్రజల కోసం సేవ చేయడమే లక్ష్యంగా ఆర్మీలో చేరిన. మా అమ్మానాన్న నర్సమ్మ-వెంకటి. ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. డిగ్రీ వరకు  చదివిన. జార్ఖండ్‌లో పనిచేస్తున్న.
 - ఉపారపు రమేశ్, పాసిగామ
 
  అమ్మానాన్న ఆశీస్సులతోనే
 నేను ఆర్మీలో చేరానేది అమ్మానాన్న కళావతి, పోచయ్య లక్ష్యం. దేశ సేవ చేయాలనేది వారి కోరిక. నాకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఏడాది క్రితం ఆర్మీల చేరా. అమ్మానాన్న ఆశీస్సులతోనే నాకీ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పనిచేస్తున్న.
 - బుద్దె వెంకటేశ్, రాయపట్నం
 
  కొద్దిలో తప్పించుకున్న
 మొన్నటి ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు హెలీకాప్టర్‌లో ఇరవై మంది వెళ్లారు. రెండు నిమిషాల ముందే అందులోంచి కిందకు దిగిన. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ కూలి 19మంది చనిపోయారు. నేను అందులో ఉంటే చనిపోయేవాన్ని.
 - గోపతి కిషన్, జవాన్
 
 ‘మిలటరీ’ మిడత
 ఈ ఫొటోలో కన్పిస్తున్న మిడత వెరైటీగా ఉంది కదూ: మిలటరీ జవాన్లు ధరించే డ్రెస్ రంగులో.. ఆకర్షిస్తోంది కదూ!! ఈ మిడతకు మిలటరీ డ్రెస్ రక్షణగా ఉంటుందట. ఎందుకంటే ఆకుపచ్చని చెట్టుపై ఉంటే ఏ శత్రువు కంట పడదట. మంథనిలోని రాజేశం అనే వ్యక్తి ఇంట్లోని చిక్కుడు చెట్టుపై వాలిన ఈ మిలటరీ మిడత ‘న్యూస్‌లైన్’ కెమెరాకు చిక్కింది. రేపు ఆర్మీడే జరుపుకుంటున్న సందర్భంలో ‘మిలటరీ’ మిడత కనిపించడం కాకతాళీయమే అయినా.. ఆసక్తిని గొలిపిస్తోంది కదూ!
  - న్యూస్‌లైన్, మంథనిరూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement