
చంద్రబాబు చొక్కాపట్టుకుని నిలదీయాలి: రోజా
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంకాదు, చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా సలహా ఇచ్చారు.
హైదరాబాద్: టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంకాదు, చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల బృందానికి లేఖలు ఎందుకు ఇవ్వడంలేదని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు, కిరణ్లకు వారి సొంత జిల్లా ప్రజల కష్టాలు కూడా తెలియడంలేదా? ఆమె ప్రశ్నించారు. వీరిద్దరూ గాంధీగారి మూడు కోతుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలుగు వారికి వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు అన్న అయితే కిరణ్ తమ్ముడిలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఆడమన్నట్లు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ సమైక్య నినాదంతో ప్రజల ముందుకు రావాలని రోజా పిలుపు ఇచ్చారు.
కలిసి ఉంటేనే కలదు సుఖం అని గుర్తించి, విడిపోయిన దేశాలు సైతం కలిసిపోతున్నాయన్నారు. విడిపోయి అన్ని రకాలుగా నష్టపోవడం కన్నా కలిసుండి అభివృద్ధి చెందడమే మేలని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపారు. విడిపోయిన దేశాలే కలిసిపోతున్నప్పుడు కలిసున్న రాష్ట్రాన్ని విభజించడం న్యాయమా? అని కాంగ్రెస్, టీడీపీ నేతలను రోజా ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసే అవకాశమున్నా సీఎం కిరణ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నా కిరణ్కుమార్రెడ్డికి కనిపించట్లేదా? అని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపిచాలని ఎందుకు కోరడం లేదని అడిగారు. సీఎం కిరణ్, చంద్రబాబు ఇద్దరూ వేర్పాటువాదులేనని దీన్నిబట్టే స్పష్టమవుతోందని రోజా అన్నారు.