జాబ్ పోయిందంటూ బాబు జాబు! | remove the inspectors in housing | Sakshi
Sakshi News home page

జాబ్ పోయిందంటూ బాబు జాబు!

Aug 28 2014 3:45 AM | Updated on Aug 10 2018 9:40 PM

చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబ్ వస్తుందంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అయితే హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల సంగతి తీసుకుంటే తీరా వచ్చింది జాబ్ కాదు ఉద్యోగాలు పోయాయంటూ జాబు వచ్చింది.

- హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల తొలగింపునకు రంగం సిద్ధం
- ఆలస్యం కానున్న ఇంటి నిర్మాణాలు
బద్వేలు: చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబ్ వస్తుందంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అయితే హౌసింగ్‌లో వర్క్ ఇన్‌స్పెక్టర్ల సంగతి తీసుకుంటే తీరా వచ్చింది జాబ్ కాదు ఉద్యోగాలు పోయాయంటూ జాబు వచ్చింది. జిల్లాలోని 51 మండలాల్లో  86 మంది ఔట్ సోర్సింగ్ కింద వర్క్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ ఆయా మండలాల్లో ఏఈలకు సహకారమందిస్తున్నారు.
 
సిబ్బంది కొరతతో ఇక్కట్లే
ప్రస్తుతం జిల్లాలో దాదాపు 60వేలకు పైగా ఇళ్ల నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 40 వేలు బేస్‌మట్టం, గోడలు, పైకప్పు వంటి దశల్లో ఉన్నాయి. వీటకి ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు ఆగిపోయాయి. దీంతో పాటు 24 వేల ఇళ్లపై సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇంకా 8600 ఇళ్లు రేషన్‌కార్డుతో మ్యాచ్ కాలేదు. ఇవన్నీ ఆయా దశల్లో పూర్తిగా నిలిచిపోయాయి. మరో 9500 ఇళ్లు పూర్తిగా పునాదులు, బేస్‌మట్టంలో ఆగిపోయాయి. వీటన్నింటిని సర్వే చేసి బిల్లులు అందజేయాలి. ప్రస్తుతం వర్క్ ఇన్‌స్పెక్టర్లను తొలగించడంతో మండలానికి ఉన్న ఒకే ఒక ఏఈ అన్ని పనులను చేయడం సాధ్యం కాదు. దీంతో ఇప్పట్లో బిల్లులు అందే పరిస్థితులు కానరావడం లేదు.

న్యాయం చేయాలంటున్న బాధితులు
తాము ఏళ్ల తరబడి సంస్థలో విధులు నిర్వహిస్తున్నామని.. వయోపరిమితి దాటిపోయినందున ఇతర ఉద్యోగాలకు అర్హత కోల్పోయామని పలువురు వర్స్ ఇన్‌స్పెక్టర్లు వాపోతున్నారు. లబ్ధిదారులకు ఇనుము, సిమెంట్, ఇటుకలు అప్పు ఇప్పించామని, బిల్లులు ఆగిపోవడంతో వ్యాపారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని బద్వేలుకు చెందిన ఒక వర్క్‌ఇన్‌స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement