రేషన్ డీలర్ల నిరాహారదీక్ష

రేషన్ డీలర్ల నిరాహారదీక్ష


గాంధీనగర్ : అధికారులు డీలర్ల మనుగడ ప్రశ్నార్థకం చేస్తున్నారని రేషన్ డీలర్లు మండిపడ్డారు. గాంధీనగర్‌లోని ఏఎస్‌వో కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు రిలే నిరాహార దీక్షలు బుధవారం చేపట్టారు. దీక్షను సంఘం నాయకుడు గాదె సుబ్బారెడ్డి ప్రారంభించారు. పలువురు డీలర్లు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. చాలీచాలని కమీషన్‌తో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయాన్నారు.


చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షుడు ఎం వెంకట్రావు మాట్లాడుతూ ఈ పోస్‌తో డీలర్ల నెలకు రూ.5 వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ పోస్ విధానంతో ఆర్థికంగా నష్టపోతున్న డీలర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రావడం లేదని ఆదేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జీతాలు అందచేయాలని కోరారు.  దుకాణాల పనివేళలకు మించి డీలర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. 24వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే 25నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జె శ్రీనివాసరావు, పి శివప్రసాద్, ఐ కిషోర్, ఎం ప్రభాకర్, భోగాల శివప్రసాద్, ఎన్ వెంకటేశ్వరరావు, డి.పి. సీతారామరాజు, పి రామకృష్ణ, ఎస్‌కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top