వివాహితపై సామూహిక అత్యాచారం | rape impact to very heavy | Sakshi
Sakshi News home page

వివాహితపై సామూహిక అత్యాచారం

Jun 3 2014 3:07 AM | Updated on Jul 28 2018 8:51 PM

పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు.

తాడిపత్రి/ పెద్దవడుగూరు, న్యూస్‌లైన్ : పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి అందరికీ పంపించడమే కాకుండా ఇంటర్‌నెట్‌లోనూ పెట్టారు. పది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారంఅమానుషం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు... ఓ వివాహిత  వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు యువకులు ఆమెపై దాడిచేశారు. చెట్లపొదల్లోకి బలవంతంగా తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ దారుణ సంఘటనను ఒకరు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నాడు.

 ‘బయటకు చెబితే నీ పరువు పోతుంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతాం’’ అని బెదిరించి వదిలేశారు. కొద్దిరోజు తర్వాత సెల్‌ఫోన్‌లో తీసిన యువకుడు మరొకరికి ఆ వీడియోను పంపాడు. ఇలా ఒకరి తర్వాత మరొకరి సెల్‌ఫోన్‌లోకి పంపించుకున్నారు. ఆఖరికి ఇంటర్‌నెట్‌లోనూ ఈ దృశ్యాన్ని పెట్టారు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని భయపడి ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తనే కుమిలిపోయింది.

సెల్‌ఫోన్‌లో వీడియోను చూసిన వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీంతో ఆమె భర్త సోమవారం పెద్దవడుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యపై అత్యాచారం చేసిన నిందితులు నాగేష్, నాగరాజు, బాలుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో విచారణ చేస్తున్నారు. వీడియో ఆధారంగా గుర్తించిన నిందితులలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement