రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరుపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరుపై జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేలు పోటీపడి ముసాయిదా బిల్లును చించివేయడంపై మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించి సీమాంధ్ర నేతల దుశ్చర్యలను ఎండగట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్కుమార్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు.
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యంలో మెదక్లో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి బస్ డిపో వరకు సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీఎం కిరణ్ కుమార్రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టారు.
టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో గజ్వేల్లో స్థానిక వివేకానంద చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేశారు. అందోల్ నియోజకర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య నేతృత్వంలో జోగిపేటలోని హనుమాన్ చౌరస్తాలో చంద్రబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. పటాన్చెరు బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు, సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నారాయణ్ఖేడ్లో రాజీవ్ చౌరస్తా వద్ద సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుబ్బాకలో స్థానిక బస్టాండు ఎదురుగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.