
మీ అందరికీ నమస్కారం అంటూ..
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు.
తెలుగులో పలకరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
తిరుపతిలో రాష్ట్రపతికి ఘనంగా పౌర సన్మానం
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. తన రెండో పర్యటనకు తిరుపతికి రావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో శుక్రవారం సాయంత్రం ఆయనకు ఏపీ ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. మీ అందరికీ నమస్కారం అంటూ తెలుగువారికి పలకరించారు. రాష్ట్రపతిగా హోదాలో మొట్టమొదట జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లినట్టు గుర్తు చేశారు. రెండో పర్యటన కోసం ఇక్కడికి రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
ఎంతో మంది గొప్ప నాయకులు ఇక్కడ జన్మించారని.. ఎన్టీఆర్, పీవీ నరసింహరావు వంటి నేతలను దేశానికి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఎంతో సేవ చేసిందని ప్రశంసించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ కొత్త ప్రయాణం ప్రారంభించిందని, రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని భరోసాయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అభిప్రాయపడ్డారు. తన సహచరుడు వెంకయ్యనాయుడు ఏపీకి చెందిన వారేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని తెలిపారు. అంబేద్కర్ స్కిల్స్ అకాడమీ ద్వారా యువతకు ఏపీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతిని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. మంత్రులు, తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.