
సాక్షి, అమరావతి: త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతోపాటు ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు వచ్చే ప్రజల కోసం ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉండడంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ను నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే.
శాసనసభ సమావేశాల తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 1వ తేదీ నుంచి ప్రజాదర్బార్ జరుగుతుందని మీడియాలో ప్రచారం సాగుతోందని, అది సరికాదని మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైతే ముఖ్యమంత్రి ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుందని, ఈలోగా ప్రజలను కలుసుకుని, విజ్ఞప్తులు స్వీకరించడం కష్టం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వచ్చే ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, అవన్నీ పూర్తయ్యాక ప్రజా దర్బార్ ప్రారంభిస్తారని తెలిపారు.