యాత్రికులు సురక్షితం : కలెక్టర్ | Pilgrims safe: Collector | Sakshi
Sakshi News home page

యాత్రికులు సురక్షితం : కలెక్టర్

Jul 19 2014 3:21 AM | Updated on Sep 2 2017 10:29 AM

జిల్లా నుంచి బదరీనాథ్, కేధార్‌నాథ్ వెళ్లిన యాత్రికులు సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శుక్రవారం తెలిపారు.

మచిలీపట్నం : జిల్లా నుంచి బదరీనాథ్, కేధార్‌నాథ్ వెళ్లిన యాత్రికులు సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శుక్రవారం తెలిపారు. బదరీనాథ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల జిల్లా వాసులు అక్కడ చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. వెంటనే బదరీనాథ్ జిల్లా అధికారులతో, జిల్లాకు చెందిన యాత్రికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నామన్నారు.

అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన 10 మంది, మచిలీపట్నంకు చెందిన ఒకరు కేధార్‌నాథ్ యాత్రకు 20 రోజుల క్రితం బయలుదేరి వెళ్లారన్నారు. వీరంతా ఢిల్లీలోని తమ బంధువుల ఇళ్ల నుంచి బయలుదేరి రుషికేష్, ఉత్తరాఖండ్, ముస్సోరి, కేధార్‌నాథ్, బదరీనాథ్ యాత్రకు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో బదరీనాథ్ వద్దకు చిక్కుకుపోయారన్నారు.  
 
మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారిని సరస్వతి నది ఒడ్డున ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమానికి అక్కడి అధికారులు తరలించారని వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు.  
 
యాత్రికుల వివరాలు

 అవనిగడ్డ వేకనూరుకు చెందిన తుంగల భవాని, తుంగల సావిత్రి, గుడివాక సాంబశివరావు, గుడివాక అరుణ, విశ్వనాధుని సుబ్బారావు, విశ్వనాధుని నాగరాజకుమారి, సనకా వెంకటశేషగిరిరావు, సనకా రాధ, సనకా ఫణీందర్, కొండవీటి కుమారి, మచిలీపట్నంకు చెందిన సిగిరేటి ఉషాకుమారి ఉన్నారు.
 
 మేము క్షేమంగానే ఉన్నాం....

 వేకనూరు (అవనిగడ్డ) : కుటుంబసమేతంగా బదరీనాథ్ యాత్రకు వెళ్లిన మండల పరిధిలోని వేకనూరుని  గ్రామానికి చెందిన భాస్కరరావు, భార్య సావిత్రి, అల్లుడు విశ్వనాథుని వెంకట సుబ్బారావు, కుమార్తె నగరాజకుమారి,మరో  అల్లుడు గుడివాక సాంబశివరావు, కుమార్తె అరుణకుమారి క్షేమంగానే ఉన్నామని బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు.  బద్రీనాధుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యామని,భారీవర్షాల వల్ల రహదారులు మూసుకుపోవడంతో రాలేకపోయామని తెలిపారు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement