అనంత రైతాంగాన్ని తుపాను నిండాముంచింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
న్యూస్లైన్ నెట్వర్క్, అనంతపురం : అనంత రైతాంగాన్ని తుపాను నిండాముంచింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతింది. రాప్తాడు మండలంలో 3200 హెక్టార్లలో పంట పాడైంది. కనగానపల్లి మండలంలో బోరుబావుల కింద 550 హెక్టార్ల లో సాగు చేయగా.. చాలా వరకు పంట తొల గించారు. అప్పటి నుంచి వర్షం పడడంతో పంటంతా పొలాల్లోనే కుళ్లిపోయింది. ఆత్మకూరు మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట దెబ్బతింది. చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో 200 హెక్టార్ల వరకు రైతులు పంట నష్టపోయారు. పెద్దవడుగూరు మండలంలో 15 వేల ఎకరాల్లో పంట కుళ్లిపోయింది. సుమారు 35 వేల ఎకరాల్లో పత్తి పంట మొగ్గ, పూత రాలిపోయింది. దీంతో దాదాపు రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
మొక్కజొన్న కూడా దెబ్బతినింది. మడకశిర నియోజకవర్గంలోని మడకశిర, రొళ్ల, అగళి, గుడిబం డ, అమరాపురం మండలాల్లో మే, జూన్లో దాదాపు 10 వేల హెక్టార్లలో పంట పెట్టారు. ఆ తర్వాత పడిన వర్షాలకు 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు మొలకెత్తి నల్లగా మారా యి. పశుగ్రాసం కూడా లభించే పరిస్థితి లేదు. బ్రహ్మసముద్రం మండలంలో 15,600 హెక్టార్లలో వేరుశనగ సాగైంది. మండల వ్యాప్తంగా వర్షం వల్ల పంట తుడిచిపెట్టుకుపోయింది. బుక్కపట్నం మండలంలో దాదాపు 9 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాలు రా క మొదట్లో కొంత నష్టం జరగ్గా.. వర్షం వచ్చి మిగిలిన పంటంతా దెబ్బతింది. అమడగూరు మండలంలో దాదాపు 9 వేల హెక్టార్లలో ముందస్తుగా వేరుశనగ సాగు చేశారు.
పంట పూత దశలో వ్యాధులు సోకడంతో దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న పంటంతా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో కూ డా పంటలు దెబ్బతిన్నాయి. పెనుకొండ మండలంలో 120 హెక్టార్లలో వేరుశనగ, 120 హెక్టార్లలో మొక్కజొన్న, 40 హెక్టార్లలో వరి, 2 హెక్టార్లలో రాగి పంట నష్టపోయింది. రొద్దం మండలంలో దాదాపు 400 ఎకరాల్లో వేరుశనగ నష్టం వాటిల్లింది.
అయితే అధికారులు మాత్రం 20 ఎకరాల్లోనే నష్టం జరిగిందని చెబుతుండడం గమనార్హం. ఇదే మండలంలోని డీఆర్ కొట్టాలలోనే 200 ఎకరాల్లో వేరుశనగ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. పరిగి మండలంలో 40 ఎకరాల్లో వేరుశనగ నష్టం వాటిల్లింది. సోమందేపల్లి మండలంలో పంటంతా నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. గోరంట్ల మండలంలో 300 ఎకరాల్లో వేరుశనగ, 50 ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. కాగా వేరుశనగ రైతుకు ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంతవరకు నష్టం అంచనా వేయలేదని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు పత్తా లేకుండా పోయారని విమర్శిస్తున్నారు.