ఖమ్మంలో కదం తొక్కారు... | peoples did strike to reduce gas price | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో కదం తొక్కారు...

Jan 5 2014 6:01 AM | Updated on May 29 2018 4:09 PM

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలు శనివారం ఖమ్మంలో కదంతొక్కారు. ప్రదర్శన, మహాధర్నా నిర్వహించారు.

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలు శనివారం ఖమ్మంలో కదంతొక్కారు. ప్రదర్శన, మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోటరీనగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరారు. ధరల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇందిరానగర్, కోర్టు, ఇల్లెందు క్రాస్‌రోడ్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని, మహాధర్నా చేపట్టారు. కట్టెల పొయ్యిని వెలిగించి నిరసన తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్ర ప్రజలు కష్టాల్లో కూరుకుపోయారని పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ గ్యాస్‌పై పేదలకు రూ.50 సబ్సిడీ ఇచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని ఎత్తివేసిందన్నారు.
 
  ప్రజలపై భారాల మీద భారాలు మోపుతున్న ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారన్నారు. నూతన భూ చట్టాన్ని అమలుచేయడంలో జిల్లా అధికారులు, ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. సత్తుపల్లిలో రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.12 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ.3.70 లక్షలు మాత్రమే ప్రకటించారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చినా ఆ పార్టీకి బుద్ధిరాలేదని యువజన విభాగం మూడు జిల్లా కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి అన్నారు. ఇంకా పార్టీ బీసీ విభాగం, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్‌లు తోట రామారావు,  వెంకటేశ్వర్లు, అధికారప్రతినిధి నిరంజన్‌రెడ్డి, సీనియర్ నాయకులు మందడపు వెంకటేశ్వరరావు, ఆకుల మూర్తి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, పద్మజారెడ్డి తదితరులు మాట్లాడారు.
 
 అనంతరం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్‌యూనియన్ కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, కొదమసింహం పాండురంగాచార్యులు, కాంపెల్లి బాలకృష్ణ, దారేల్లి అశోక్, వల్లూరి సత్యనారాయణ, కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లేపల్లి సైదులు, ముస్తఫా, సునీల్, అశోక్, మార్కం లింగయ్యగౌడ్, మైపా కృష్ణ, దోడ్డి సాంబయ్య, పుల్లయ్య, జంగాల శ్రీను, ఎన్.వెంకటేశ్వర్లు, పత్తి శ్రీను, జాకబ్ ప్రసాద్, కె. జ్యోతిర్మయి, షర్మిలా సంపత్, రేణుక, యశోద, సబిత, సీత, ఎస్‌కె.సకీనా, హెచ్.వెంకటేశ్వర్లు, పొదిల వెంకటేశ్వర్లు,సుందర్‌రావు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement