సర్వం.. సమస్యల మయం | Sakshi
Sakshi News home page

సర్వం.. సమస్యల మయం

Published Mon, May 28 2018 9:10 AM

Patients Facing Problems In Sarvajana Hospital Ananthapur - Sakshi

 అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో మౌలిక సదుపాయా లు కొరవడ్డాయి. రోజూ మూడు వేలమంది దాకా రోగులు వైద్యం కోసం వస్తున్నారు. సౌకర్యాలు కల్పించడంలో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం రోగులకు శాపంగా మారుతోంది. ఆస్పత్రిలో ఏ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని, రోగులకు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయో పరిశీలించేందుకు ఈ నెల 31న నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ (ఎన్‌ఏబీహెచ్‌) బృందం వస్తోంది. వైద్య సేవల తీరును పరిశీలించి ర్యాంకు ఇస్తారు. దీని ద్వారా ఆస్పత్రి స్థాయి ఏపీ చిత్రపటంలో ఓ మార్క్‌ వేసుకోనుంది. 

జీఓ 124 ప్రకారం సర్వజనాస్పత్రిలో 649 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రోగులను తీసుకెళ్లే ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు లేకపోవడంతో శానిటేషన్‌ సిబ్బంది, రోగి బంధువులే ఆ పని చేయాల్సి వస్తోంది.
ఆస్పత్రిలో కొందరు సిబ్బంది నాణ్యతా ప్రమాణాలకు మంగళం పాడుతున్నారు. పనిభారం కారణంగా ముందస్తుగానే సిరంజిలు లోడ్‌ చేసి ఉంచడంతో పాటు వాడిన బ్లడ్‌ బ్యాగులు, సిరంజిలను ఎక్కడపడితే అక్కడ వదిలేస్తున్నారు.  
ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా పారిశుద్ధ్యం మెరుగుపడలేదు.  

ఇక్కడ రోగిని ఎంఎం వార్డుకి తీసుకెళ్తున్నది ఓ పారిశుద్ధ్య కార్మికురాలు. వాస్తవంగా రోగులను తీసుకెళ్లేందుకు ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు ఉండాలి. అయితే 30 ఏళ్లుగా ఇక్కడ ఈ పోస్టులు భర్తీ చేయలేదు. చివరకు పారిశుద్ధ్య కార్మికులే దిక్కవుతున్నారు.

సర్వజనాస్పత్రిలోని ఓ వార్డులో సిరంజిల్లో ముందస్తుగా మందులోడ్‌ చేసి ఉంచారు. ఇలా చేయడం ద్వారా రోగులకు ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం లేకపోలేదు. రోగికి వాడిన సిరంజిలనూ పక్కనే ఉంచారు. ప్రాణాంతక జబ్బులతో బాధపడే వారి ఇన్ఫెక్షన్స్‌ సోకితే అంతే సంగతులు. గతేడాది ఎన్‌ఏబీహెచ్‌ బృందం ఈ అంశాన్ని ప్రధానంగా రిమార్క్స్‌లో పొందుపర్చింది. 1947 కాలం పద్ధతులు అనుసరిస్తున్నారని ఓ స్టాఫ్‌నర్సుకు చివాట్లు పెట్టింది. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు.  

రోగులను రెండు, మూడో అంతస్తులోని వార్డులకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి యాజమాన్యం ఈ ఏడాది రూ. 6 లక్షలు వెచ్చించి లిఫ్ట్‌ ఏర్పాటు చేసింది. కానీ తరచూ లిఫ్ట్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. 

Advertisement
Advertisement