సంక్షేమ వసతిగృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వార్డెన్లలో జవాబుదారీతనం లోపించడం, పర్యవేక్షణ లేకపోవడంతో చివరకు హాస్టళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : సంక్షేమ వసతిగృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వార్డెన్లలో జవాబుదారీతనం లోపించడం, పర్యవేక్షణ లేకపోవడంతో చివరకు హాస్టళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది.దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు హాస్టళ్లకు దూరంగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థల తరహాలోనే భాగస్వామ్యం చేసేందుకు సంకల్పించింది. ఇకనుంచి ప్రతి నెలలో మొదటి ఆదివారం హాస్టళ్లలో పేరెంట్స్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
ఎందుకంటే..
నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థు ల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసేందుకు ఏర్పడిన హాస్టళ్లు కొంతకాలంగా అనుకున్న లక్ష్యానికి దరిదాపులకు కూడా చేరడం లే దు. కొద్ది మంది మినహా వార్డెన్లు విధులు నిర్లక్ష్యం చేయడం, పర్యవేక్షించాల్సిన సహా య సంక్షేమ శాఖ అధికారులు వార్డెన్లతోనే కుమ్మక్కు కావడం, ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించిన కారణంగా హాస్టళ్లు అస్తవ్యస్తంగా తయారయ్యా యి.
వార్డెన్లు అధికారుల నియంత్రణ లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులు ప్రమాదాలబారిన పడడం, మరణాలు సంభవించ డం, బాలికల వసతిగృహాల్లోనైతే లైంగికదాడుల ఘటనలు జిల్లాలో వెలుగుచూశాయి. వీటన్నింటి కారణంగా చాలామంది ప్రభుత్వ వసతిగృహాలు అంటేనే విముఖత చూపించే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఫలితంగా జిల్లాలో చాలా హాస్టళ్లు విద్యార్థులు చేరకపోవడంతో మూతపడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తేనైనా హాస్టళ్లు మన గలుగుతాయనే విశ్వాసంతో తల్లిదండ్రుల సమావేశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
లక్ష్యం ఇదీ..
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడం వల్ల వార్డెన్లు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం కుదురుతుంది. హాస్టళ్ల తీరు కాస్త మెరుగుపడుతుంది. అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే తల్లిదండ్రులే నిలదీసే పరిస్థితి హాస్టళ్లలో నెలకొంటుంది. మెనూ పాటించడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. విద్యార్థుల హాజరుశాతం పెరుగుతుంది. హాస్టళ్లపై తల్లిదండ్రుల నిఘా ఉంటుంది.
2న సమావేశాలు
ఈ నెల 2న జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశాలను పర్యవేక్షించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి ఉన్నతాధికారులు రానున్నారని ఆయన చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి నెల మొదటి ఆదివారంలో అన్ని హాస్టళ్లలో ఈ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో తల్లిదండ్రులు చేసిన సలహాలు, సూచనలను తప్పకుండా పాటిస్తామన్నారు.