ప్రైవేట్ కళాశాలల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కొన్ని కళాశాలల యాజ మాన్యాలు పరీక్ష రుసుమును సైతం తమకు నచ్చిన విధంగా వసూలు చేస్తున్నాయి.
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్లైన్ : ప్రైవేట్ కళాశాలల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. కొన్ని కళాశాలల యాజ మాన్యాలు పరీక్ష రుసుమును సైతం తమకు నచ్చిన విధంగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుకు మూడు రెట్లు అదనంగా ముక్కుపిండి మరీ గుంజుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉండగా కొన్ని యాజ మాన్యాలు బలవంతంగా రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నాయి. సైన్స్ విద్యార్థులయితే పరీక్ష ఫీజు, ప్రాక్టికల్ రుసుంతో కలిపి రూ.400 చెల్లించాల్సి ఉండగా, వారి వద్ద నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారు.
జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో 138 అన్ ఎయిడెడ్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలల్లో ఫీజులను సక్రమంగానే వసూలు చేస్తున్నా అన్ఎయిడెడ్ కళాశాలలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రెండు సంవత్సరాలకు కలుపుకొని అన్ఎయిడెడ్ కళాశాలల్లో 25 వేల మంది విద్యార్థులున్నారు. వీరి వద్ద నుంచి మూడు రెట్లు అదనంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థుల(ఎంపీసీ, బైపీసీ) నుంచి ప్రాక్టికల్స్ ఫీజులను కూడా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ ఫీజుగా ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేయాల్సి ఉండగా నిర్బందంగా రూ.500 వసూలు చేస్తున్నారు.
తాము చెప్పే విధంగా ఫీజు చెల్లిస్తే ప్రాక్టికల్స్లో మంచి మార్కులు వచ్చేలా మేనేజ్ చేస్తామని, లేకపోతే మీ ఇష్టమని భయపెడుతున్నాయి. సైన్స్ విద్యార్థులు ఎంపీసీ అయితే 60 మార్కులకు, బైపీసీ అయితే 120 మార్కులకు వివిధ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు వారికి కీలకం. ఈ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా, రాత పరీక్షలో సాయం చేసేందుకు అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు కొన్ని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులకు చెబుతున్నాయని సమాచారం.
అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు
: ఆర్ఐవో రమేష్బాబు హెచ్చరిక
ఇంటర్మీడియట్ విద్యార్థుల నుంచి బోర్డు నిర్దేశించిన ఫీజునే వసూలు చేయాలని, పరీక్ష ఫీజు పేరుతో కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) రమేష్బాబు హెచ్చరించారు. అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలల గురించి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తనకు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వాటిపై విచారణ చేస్తున్నామని వివరించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు నవంబర్ 5 వరకు గడువు ఉందని తెలిపారు.