లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
పార్వతీపురంటౌన్/సీతానగరం/ వీరఘట్టం : లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలోని మందిరం వీధికి చెందిన వేల బాషా(24)తోపాటు మరో ఆరుగురు ఆదివారం రాత్రి సాలూరులోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం తిరుగుప్రయాణంలో వీరఘట్టం వస్తుండగా.. సీతానగరం మండలం మరిపివలస వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాషా మృతిచెందాడు. మూడడ్ల చిన్నంనాయుడు, మామిడి రామ్మూర్తి, రెడ్డి సాగర్, ఎం. రేగినాయుడు, యాళ్ల చంటి, కొయ్యాన అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
మృతుడు బాషా స్వగ్రామమైన వీరఘట్టం మందిరంవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవార్త తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.