రుణమాఫీ ప్రహసనంగా చేసి ఇప్పుడు యాత్రలా? | now remedied with a trip to forgive the debt? | Sakshi
Sakshi News home page

రుణమాఫీ ప్రహసనంగా చేసి ఇప్పుడు యాత్రలా?

Sep 6 2015 11:59 PM | Updated on Sep 2 2018 4:48 PM

రైతుల రుణమాఫీని ఎన్నో అడ్డంకులతో, అవకతవకలతో ఒక ప్రహసనంలా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న ‘రైతు కోసం చంద్రన్న యాత్రలు’

 ప్రశ్నించిన లోక్‌సత్తా నాయకులు
 శ్రీకాకుళం అర్బన్  : రైతుల రుణమాఫీని ఎన్నో అడ్డంకులతో, అవకతవకలతో ఒక ప్రహసనంలా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న ‘రైతు కోసం చంద్రన్న యాత్రలు’ వారికి భరోసానిస్తాయా అని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల కుదేలైన రైతులకు కనీసం బీమా అందజేయలేదన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్న చంద్రబాబు ఇప్పుడెందుకు వాటి గురించి ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు. రైతుల ఉత్పత్తులు ఎక్కడైనా విక్రయించేలా వీటిపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ప్రకటన చేయాలన్నారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ యాత్రకు అర్థం ఉండదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి ఎ. మల్లేశ్వరరావు, వి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement