శ్రీకాకుళం: జిల్లాలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఇటీవల డయేరియా ప్రబలి పలువురు ఆస్పత్రిలో చేరగా, తాజాగా రెల్లి వీధి బీసీ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్ల గత ఆరు రోజుల నుంచి శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అతిసారంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మంగళవారం ఒక్కరోజునే మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది.
మరో 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలే. వాస్తవానికి డయేరియా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, నగరంలో సగం డయేరియా విషకోరల్లో చిక్కుకుందని సమాచారం.
డయేరియా ప్రబలుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కేసుల వివరాలు బయట పెట్టలేదు. అయితే దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మోణింగి సంతోష్(41) కూడా వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం మరణించాడు. ఆస్పత్రికి వెళ్లే వరకైనా వీరి ప్రాణాలు నిలబడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


