సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోవూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండించడమే నేరమా.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం పాపమా? అని ప్రశ్నించారు. కోవూరు ఘటన ముమ్మటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కాకాణి ఈరోజు.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం, కాకాణి మాట్లాడుతూ.. ‘కోవూరులో బాలిక హత్యను ఖండించడమే నేరమా?. పోక్సో చట్టంపై అవగాహన ఉన్న మేము ఎక్కడా బాలిక వివరాలు వ్యాఖ్యానించలేదు. అధికార పార్టీలోని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఈ ఘటనలో స్వయంగా గంజాయిపై వ్యాఖ్యలు చేశారు. నిందితుల పట్ల ఉదాశీలతగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ అక్రమ కేసులో నాకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి అధికార పార్టీ ముందుకు రావడం లేదు.
జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ కేసులో సంబంధం లేని ప్రశ్నలు వేశారు. కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. పరిపాలన చేత కాకపోతే వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అశేష జనాభా కదిలి వచ్చారు. వైఎస్ జగన్ ప్రజాదరణ ఓర్వలేక పచ్చ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది’ అని మండిపడ్డారు.


