
బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది!: జూపూడి
‘సభలో కౌగిలించుకోవచ్చు.. బయటకు వెళితే విషపు చూపులు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని వదిలి వారంరోజులు బయటకు వెళ్లాలంటే కుటుంబానికి భద్ర త ఉంటుందో ఉండదోననే భయం వేస్తోంది..’
మండలిలో వైఎస్సార్సీపీ నేత జూపూడి
సాక్షి, హైదరాబాద్:‘సభలో కౌగిలించుకోవచ్చు.. బయటకు వెళితే విషపు చూపులు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని వదిలి వారంరోజులు బయటకు వెళ్లాలంటే కుటుంబానికి భద్ర త ఉంటుందో ఉండదోననే భయం వేస్తోంది..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పరిస్థితి మరింత కష్టంగా ఉంటుందని, అందుకే సమైక్యాంధ్ర కోరుకుంటున్నామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రతో వచ్చిన రాష్ట్ర విభజన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో భాగంగా జూపూడి శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. హైదరాబాద్ను యాస పేరుతో విభజించాలని చూస్తున్నారని, ఇక్కడ పుట్టిన వాళ్లు మాత్రమే ఇక్కడ ఉండాలని అంటున్నారని చెప్పారు. ‘పాలకులు ఆంధ్రా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టే తిరిగారుు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేశారు...’ అని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కల్పించుకుని వైఎస్ బలమైన, ప్రజాదరణ కలిగిన నాయకుడనే విషయంలో ఎలాంటి వివాదం లేదని, న్యాయపరమైన కోరిక అయిన తెలంగాణను అధిష్టానం పరిశీలిస్తోందని వైఎస్ సభలోనే చెప్పారని అన్నారు. ‘ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉంటుంది, ఆయా ప్రాంతాన్ని బట్టి యాస ఉంటుంది.. వీటిని బట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే కేంద్రాన్ని మెడలు వంచే స్థాయి నుంచి కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ మాట్లాడుతూ దుర్బుద్ధితోనే పవర్ ప్రాజెక్టులన్నీ సీమాంధ్రలో ఏర్పాటు చేశారన్నారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్ప: సీఎం
ముఖ్యమంత్రి పదవికన్నా ఏఐసీసీ అధ్యక్ష పదవే గొప్పదని సీఎం కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 16 మంది సీఎంలైనప్పటికీ.. వారిలో దామోదరం సంజీవయ్య ఒక్కరే దళితుడని అన్నారు. ఆయన్నూ రెండేళ్లకే తప్పించారన్నారు. ఆ సమయంలో సీఎం స్పందిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవయ్యను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశారని, సీఎం కంటే ఏఐసీసీ అధ్యక్షుడి పదవే గొప్పదని అన్నారు.