ఎన్‌ఎంయూ సమ్మె నోటీసు | NMU issues strike notice | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంయూ సమ్మె నోటీసు

Dec 25 2013 1:17 AM | Updated on Sep 2 2017 1:55 AM

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక డిమాండ్‌గా సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) తెలిపింది.

ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక ఎజెండా

 సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణే ఏకైక డిమాండ్‌గా సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) తెలిపింది. కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఎన్‌ఎంయూ అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్, మరికొందరు ప్రతినిధులతో కలిసి ఆయన మంగళవారం ఆర్టీసీ పరిపాలన విభాగం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీస్‌ను అందజేశారు. జనవరి 8లోపు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని నాగేశ్వర్‌రావు యాజమాన్యాన్ని హెచ్చరించారు.

గతేడాది జూలై 28న రవాణామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉందన్నారు. సీమాంధ్రలో సకల జనుల సమ్మె సమయంలో ప్రభుత్వం కార్మికసంఘాలతో చర్చించిందని, ఉద్యోగుల క్రమబద్ధీకరణకు డిసెంబర్‌లోపు జీవో విడుదల చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదన్నారు. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లోనే తాము సమ్మెకు సిద్ధమవ్వాల్సి వస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులైరె జ్ చేసేవరకు విశ్రమించబోమని చెప్పారు. గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.

ఆర్టీసీ యాజమాన్యానికి ఆ సంఘం ఇచ్చిన సమ్మె నోటీస్‌లో కార్మికుల డిమాండ్లపై స్పష్టత లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని నాగేశ్వర్‌రావు అంతకుముందు బస్‌భవన్ ఎదుట జరిగిన కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా  విఫలమయ్యాయని, ఏడాది కాలంలో ఒక్క సమస్యనూ పరిష్కరించ లేకపోయాయని విమర్శించారు. ఈ ధర్నాలో పలు డిపోలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement