పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా? | Need puskaralaku consultancy? | Sakshi
Sakshi News home page

పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?

Feb 14 2015 3:43 AM | Updated on Sep 2 2017 9:16 PM

పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?

పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?

మన రాష్ట్రంలో పుష్కరాలను మనం నిర్వహించుకోవడానికి కూడా కన్సల్టెన్సీల అవసరం కావాల్సి వచ్చిందా?

  • చంద్రబాబు ప్రభుత్వ తీరుపై
  • కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజం
  • సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో పుష్కరాలను మనం నిర్వహించుకోవడానికి కూడా కన్సల్టెన్సీల అవసరం కావాల్సి వచ్చిందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, అధికారుల ప్రభుత్వం నడుస్తోందా? లేదంటే విదేశీ కన్సల్టెన్సీల ప్రభుత్వం నడుస్తోందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

    ప్రభుత్వంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైనా రంగానికి సంబంధించి నిపుణులు లేకుంటేనే.. ఆయా రంగానికి విదేశీ కన్సల్టెన్సీల అవసరం ఏర్పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అన్నింటికీ విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకునే తీరు కనబడుతోందని విమర్శించారు. ‘‘గోదావరి పుష్కరాల బాధ్యతలను కన్సల్టెన్సీకే ఇచ్చారు.. తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్లాన్ రూపకల్పన బాధ్యతలు విదేశీ కన్సల్టెన్సీకి ఇచ్చారు.

    ఇక రెవెన్యూ చట్టంలో మార్పులు తేవడానికి కన్సల్టెన్సీ.. సీఎం విదేశీ పర్యటన ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ.. నీటి పారుదలశాఖలో అంశాలకు కన్సల్టెన్సీ..  ప్రభుత్వ ప్రచార బాధ్యతల నిర్వహణకు కన్సల్టెన్సీ.. చివరకు రోడ్ల పనుల నాణ్యతా తనిఖీలనూ కన్సల్టెన్సీకి ఇస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. సీఎంకు తన ప్రభుత్వంలోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లపై నమ్మకం లేక కన్సల్టెన్సీల నియామకానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు.

    ఒకవైపు రాష్ట్రంలో లోటు బడ్జెట్ అంటూ కన్సల్టెన్సీల పేరుతో రూ.వందల కోట్లను విదేశీ సంస్థలకు చెల్లించడమేమిటని తప్పుపట్టారు.చంద్రబాబు కుటుంబానికి సింగపూర్‌లో హోటళ్లు, కంపెనీలున్నాయన్న ప్రచారం ఉందని, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకుని.. వాటిద్వారా అక్కడ తన సంస్థలకు క్విడ్ ప్రో కో జరుగుతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆయన చెప్పారు.
     
    లోటు బడ్జెట్ అంటూనే..: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లా ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మోహన్‌రెడ్డి విమర్శించారు. కన్సల్టెన్సీలకు రూ.వంద కోట్లు, సంక్రాంతి సంబరాలకు రూ.324 కోట్లు.. కేవలం సంచులపై చంద్రబాబు ఫొటో వేసుకోవడానికి రూ.15 కోట్లు.. ఇంకా విదేశీ పర్యటనలకు, వాస్తు పేరుతో కోట్లలో ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను తేవడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement