తాళ్లపూడి ఎస్సీ కాలనీలో అధికారపార్టీ నేతల పైశాచికం
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశాల మేరకే...
ముత్తుకూరు (పొదలకూరు) : టీడీపీకి ఓట్లేయలేదని తాళ్లపూడి ఎస్సీ కాలనీలో తాగునీటికి ఏకైక దిక్కైన వాటర్ ప్లాంట్కు ఆ పార్టీ నేతలు విద్యుత్ కనెక్షన్ తొలగించి తాళం వేసి పాశవిక ఘాతుకానికి పాల్పడ్డారు. ఫలితంగా కాలనీలో దాహాకారాలు మిన్నంటాయి. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సేకరించిన సమాచారం మేరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి ఎస్సీకాలనీలో ఇటీవల సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పర్యటించారు.
ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు ఎస్సీ కాలనీ వాసులందరూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులని, గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేయలేదని వివరించారు. దీంతో ఆగ్రహానికి గురైన సోమిరెడ్డి ఎస్సీలకు మంచినీరు సరఫరా బంద్ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. సోమిరెడ్డి ఆదేశాల మేరకే టీడీపీ నేతలు వాటర్ ప్లాంట్కు విద్యుత్ కనెక్షన్ తొలగించి తాళం వేశారు. దీంతో స్థానికులు మంచినీటికి అల్లాడుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ఎమ్మెల్యే ఆదేశాలు మేరకే మంచి నీటిని సరఫరా చేస్తామని సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు అందకపోవడంతో మూడురోజులుగా కలుషిత నీరు తాగుతున్నామని, రోగాల బారిన పడుతున్నారని ఆగ్రహం చెందుతున్నారు. అసలే వేసవి.. తాగునీటి విషయంలో ఇలా రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఓటేయకుంటే గొంతెండబెడతారా? అని నిలదీస్తున్నారు.


