
రాజమహేంద్రవరం క్రైం: మసీదులో హత్యకు గురైన మౌజాన్ మహ్మద్ ఫారూఖ్ (61) మృతదేహాన్ని ఉద్రిక్తత నడుమ శనివారం బీహార్ రాష్ట్రానికి తరలించారు. శుక్రవారం తెల్లవారు జామున మసీదులో హత్యకు గురైన మౌజాన్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఉదయం పోస్టుమార్టం జరిగిం ది. ఈ సందర్భంగా ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో ముస్లిం చేరుకున్నారు. దీనితో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అదనపు బలగాలు మోహరించారు. అనంతరం మహ్మద్ ఫారూఖ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. పోలీస్ బందోబస్తు మధ్య అంబులెన్స్లో మృతదేహాన్ని లాలాచెరువు సెంటర్కు తరలించారు. అక్కడ ముస్లిం మత పెద్దలు నమాజ్ నిర్వహించి అనంతరం బీహార్ రాష్ట్రం తరలించారు. ఆస్పత్రి వద్ద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
న్యాయం చేయాలంటూ ర్యాలీ
మౌజాన్ మృతదేహాన్ని తరలించిన అనంతరం ముస్లిలు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేస్తు ర్యాలీగా లాలా చెరువు, ప్రభుత్వాస్పత్రి, వై.జంక్షన్, దేవీచౌక్, మీదుగా ఆజాద్చౌక్కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. దారి పొడవునా తెరచి ఉన్న షాపులు నిరసనగా మూయించి వేశారు. ఆజాద్ చౌక్ వద్ద మానవ హారం నిర్వహించారు. ఈ ర్యాలీ వెంట సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, వన్టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీరావు ఉన్నారు.
సమయ స్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు
మౌజాన్ హత్య అనంతరం నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి నిరంతర పర్యవేక్షణలో డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది అలుపెరగని గస్తీ నిర్వహించి సమస్య జటిలం కాకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకున్నప్పటికీ సామరస్యపూరకంగా మృతదేహాన్ని మౌజాన్ సొంత రాష్ట్రం బీహార్కు తరలించారు.
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్
జిల్లా అధ్యక్షుడు మోషేన్రాజు
దానవాయిపేట (రాజమహేంద్రవరం): లాలాచెరువు బత్తిన నగర్లో నౌరానీ మసీదులో మౌజాన్ మహ్మద్ ఫారుఖ్ను హత్య చేసి, ఖురాన్ని తగలబెట్టడం ప్రభుత్వం వైఫల్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్రాజు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులపైన దాడులు అధికమవుతున్నాయని టీడీపీ, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల్లే ఉత్తరప్రదేశ్లో సైతం ఇటువంటి ఘట్టన జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల ఆహారపు అలవాట్ల పైనా దాడులు జరుగుతున్నాయని ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు.
ప్రభుత్వం త్వరగా స్పందించి ఉంటే బాగుండేది
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: మౌజాన్ ఫారూఖ్ హత్య సంఘటనపై ప్రభుత్వం త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆయన లాలాచెరువులోని నౌరానీ మసీదులో మౌజన్ మహ్మద్ ఫారూఖ్ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ముస్లిం పెద్దలతో సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఈ సంఘటనపై పార్లమెంటు సమావేశాల్లో చర్చిస్తామన్నారు. ముస్లింలకు తమ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. మాజీ కేంద్ర మంతి ఎంఎం పళ్ళంరాజు, ఉభయగోదావరి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంతం నానాజీ, రఫీ ఉల్లాబేగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.