‘మున్సిపల్’ ముట్టడి ఉద్రిక్తం | 'Municipal' tense siege | Sakshi
Sakshi News home page

‘మున్సిపల్’ ముట్టడి ఉద్రిక్తం

Jul 24 2015 1:27 AM | Updated on Apr 3 2019 8:52 PM

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

బొబ్బిలి : బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సమ్మె నేపథ్యంలో ఏర్పడిన అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్కర్స్ యూనియన్ నాయకుడు పి. శంకరరావుతో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రాంబర్కి శరత్, ఏగిరెడ్డి శ్రీధర్, పారి శుద్ధ్య కార్మికులు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.  విషయం తెలుసుకున్న పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఏఎస్సై కిందపడిపోయారు.
 
 అయినప్పటికీ కార్మికులు పోలీసులను తోసుకుని కార్యాలయం లోపలికి వెళ్లి రెండు గేట్ల తాళాలు వేసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ పట్టణ నాయకులు, కౌన్సిలర్లు పొట్నూరు కిరణ్‌కుమార్, మరిపి తిరుపతిరావు, పర్తాపు చంద్రశేఖర్, పిల్లా రామారావులతో పాటు సీపీఐ నాయకులు ఒమ్మి రమణ, ముల్లు వెంకటరమణ, పట్టణ పౌరసంక్షేమ సంఘ నాయకులు వెన్నెల చిన్నంనాయుడు, గ్రోత్‌సెంటర్ కార్మిక సంఘ నాయకుడు గోపాలం, రైతు సంక్షేమ సంఘ నాయకుడు లక్ష్ముంనాయుడు, ఎన్‌జీఓ సంఘ నాయకులు రమణ, కర్ణ, రిటైర్డు పింఛనర్ల సంఘ నాయకులు చుక్క మహందాతనాయుడు, సత్తిరాజు, తదితరులు మద్దతు తెలిపారు.   
 
  పెర్మినెంటు ఉద్యోగులు కూడా ఆందోళనకు మద్దతు తెలిపి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్మిక నాయకులను పోలీసులు బలవతంగా అక్కడ నుంచి లాక్కెల్లి పోలీసుస్టేషనుకు తరలించారు. డీఎస్పీ బీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు దాదాపు 70 మంది పారిశుద్ధ్య కార్మికులు, కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 మోకాళ్లపై నిరసన
 పార్వతీపురం టౌన్ : ఆందోళనలో భాగంగా మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు స్థానిక పాతబస్టాండ్ వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్ర పోతోందని ఎద్దేవా చేశారు. అనంతరం కార్మికులు నిరసన శిబిరం వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు.  సీఐటీయు డివిజన్ కార్యదర్శి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు, మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  
 
 సాలూరులో మానవహారం
 సాలూరు రూరల్ : సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు స్థానిక వైఎస్సార్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి వైఎస్సార్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆందోళన చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లిస్తే నేటి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం లేదని ఎద్దేవా చే శారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు.  కార్యక్రమంలో టి.వెంకటరావు, సంతోష్ ,అశోక్, శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు.
 
 సమ్మె తీవ్రరూపం
 విజయనగరం మున్సిపాలిటీ : గతంలో ఇచ్చిన హమీల ప్రకారం కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు రూ. 15వేల కనీసం వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌పై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె తీవ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలను నిర్వహించి తమ నిరసను వెల్లగక్కిన కార్మికులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, రెగ్యులర్ సిబ్బంది పాల్గోనున్నారు. 14 రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేపట్టగా, రెగ్యులర్ సిబ్బంది అంతంతమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారు. రెండు వారాలు గడిచినా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో సమ్మె తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెగ్యులర్ కార్మికులను కూడా సమ్మెలో భాగస్వాములను చేయబోతున్నారు.
 
  ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులు టీవీ రమణ, వి.కృష్ణంరాజులు విజయనగరం మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడుకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. దీంతో విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 275 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 34 మంది డ్రైవర్లు సమ్మెలో ఉండగా.. రెగ్యులర్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న మరో 200 మంది సిబ్బంది కూడా విధులు బహిష్కరించనున్నారు. అదేవిధంగా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 105 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 9 మంది వాటర్ వర్క్స్ సమ్మెలో ఉండగా.. 50 మంది రెగ్యులర్ సిబ్బంది సమ్మె బాటపట్టనున్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 44 మంది కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 79 మంది రెగ్యులర్ సిబ్బంది, సాలూరులో 62 మంది కాంట్రాక్ట్ సిబ్బందికి మద్దతుగా 48 మంది రెగ్యులర్ సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. రెండు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement