ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి | movement against open caste | Sakshi
Sakshi News home page

ఓపెన్‌కాస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

Jan 5 2014 6:10 AM | Updated on Oct 17 2018 3:43 PM

సింగరేణి ఓపెన్‌కాస్టులకు వ్యతి రేకంగా ప్రజలు ఉద్యమించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు కోరారు. సత్తుపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూనిర్వాసితుల రిలేనిరాహార దీక్షలు శనివారం ఐదోరోజుకు చేరాయి.

 సత్తుపల్లి, న్యూస్‌లైన్:
 సింగరేణి ఓపెన్‌కాస్టులకు వ్యతి రేకంగా ప్రజలు ఉద్యమించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు కోరారు. సత్తుపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ భూనిర్వాసితుల రిలేనిరాహార దీక్షలు శనివారం ఐదోరోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని ఆయన శనివా రం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ కొత్త చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందుగానే భూములను ఎందుకు స్వాధీనపర్చుకుందీ ప్రభుత్వాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరు (అధికారులు) ప్రజలపక్షమా.. పెట్టుబడిదారులపక్షమా..?’ అని ప్రశ్నించా రు. ఓపెన్‌కాస్టులతో ప్రజారోగ్యం దెబ్బతింటుం్దని, పంట భూములు బొందల గడ్డలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూనిర్వాసితులకు తగిన నష్ట పరిహారం ఇప్పించటంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శిం చారు.
 
 ‘పోడు కొడితే పర్యావరణం దెబ్బతింటుందని ప్రచారం చేసే పాలకులు... వేల ఎకరాల  పంట భూములను ఓపెన్‌కాస్టులతో విషతుల్యం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు?’ అని ప్రశ్నిం చారు. సత్తుపల్లిలో థర్మల్ పవర్ స్టేషన్‌కు అనుమతి ఇవ్వకుండా, బొగ్గు మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు తరలించటం సరికాదని అన్నారు. భూసేకరణకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దయ్యేంత వరకు నిర్వాసితులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొం టామన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూకలకుంట రవి, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకన్న తదితరులు ఉన్నారు.
 
 మంత్రి వెంకటరెడ్డి,
 ఎమ్మెల్సీ పొంగులేటి సంఘీభావం
 సింగరేణి భూనిర్వాసితుల దీక్షలకు మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న నిర్వాసితులతో వారు ఫోన్‌లో మాట్లాడుతూ.. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, జనరల్ అవార్డుతో జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
 నిర్వాసితులకు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతుల పక్షాన టీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందన్నారు. బీజేపీ నాయకులు దుగ్గి అప్పిరెడ్డి, వందనపు భాస్కర్‌రావు కూడా సంఘీభావం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement