కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.
బాపట్ల (గుంటూరు జిల్లా) : కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు బిడ్డలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాపట్లలోని తుఫాన్నగర్కు చెందిన వెంకటేశ్వర్లు తన పెద్ద కుమార్తె కృష్ణవేణి(30)ని ఒంగోలుకు చెందిన తన మేనల్లుడు శేఖర్కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశాడు. కృష్ణవేణి, రమేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు లక్ష్మీప్రసన్న(9), అమ్ములు(6) ఉన్నారు. కాగా లారీ డ్రైవర్గా పని చేస్తున్న శేఖర్ భార్య, పిల్లలతో బాపట్లలోని దేవుడుమాన్యంలో నివసిస్తున్నాడు.
అయితే శేఖర్ తాగుడుకు బానిస కావడంతో భార్యతో తరచు గొడవపడేవాడు. నిత్యం వేధింపులు, గొడవల కారణంగా మనస్తాపానికి గురైన కృష్ణవేణి భర్త లేని సమయం చూసి గురువారం రాత్రి ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బాపట్ల మండలం మహాత్మాజీపురం రైల్వేట్రాక్పై శుక్రవారం విగతజీవులై పడి ఉన్న తల్లీ, బిడ్డల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.