దసరా పండగంటేనే మద్యం కిక్కు గుర్తుకొస్తుంది. ప్రతీ ఏడాది ఎక్సైజ్ శాఖ కూడా ప్రజలకు దిగనంత కిక్కెకించాలని ఎదురుచూస్తుంది. దీంతో ఈ నెలలో మద్యం అమ్మకాలు భారీగా పెరగనున్నాయి.
కోల్సిటీ, న్యూస్లైన్ : దసరా పండగంటేనే మద్యం కిక్కు గుర్తుకొస్తుంది. ప్రతీ ఏడాది ఎక్సైజ్ శాఖ కూడా ప్రజలకు దిగనంత కిక్కెకించాలని ఎదురుచూస్తుంది. దీంతో ఈ నెలలో మద్యం అమ్మకాలు భారీగా పెరగనున్నాయి. వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాక్ తెచ్చి సిద్ధంగా ఉంచారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో ఇప్పటికే మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దసరాకు నాలుగైదు రోజుల ముందు నుంచి విక్రయాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో దసరా సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.70 కోట్ల వరకు జరగనుంది. ఇక దసరా పండగకు మటన్, చికెన్ వంటి మాంసాహార వ్యాపారం భారీగానే జరుగుతుంది. ఇప్పటినుంచే మాంసాహారం అమ్మకాలు పెరగగా, దసరాకు రెండు మూడు రోజుల ముందు నుంచి భారీ ఎత్తున వ్యాపారం జరగనుంది. చికెన్, మటన్ ధరలు భగభగ మండుతుండగా, పండగకు మరింత పెరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా మేకలు, గొర్రెలు, కోళ్లపై రూ.60 కోట్లకు పైగా ఖర్చుచేస్తారని అంచనా.
పిండివంటలు..
పిండివంటలు, సత్తుపిండి, భోజనాలు తదితర వాటికోసం కూడా భారీగా ఖర్చయ్యే అవకాశముంది. పెరిగిన వంటనూనె ధరలు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేయాల్సిందే.
కల్తీ వస్తువుల హాల్చల్
దసరా ధమాకాలో కల్తీ, నకిలీ వస్తువులను కొందరు అంటగడుతున్నారు. నిత్యావసరాలతోపాటు బట్టలు, కాస్మోటిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు నకిలీవి వస్తుండడంతో ప్రజలు ఏది అసలుదో... ఏది నకిలీయో తేల్చుకోలేక అయోమయానికి గురవుతున్నారు. నకిలీ, కల్తీ మద్యం విక్రయాలు సైతం జోరందుకుంటున్నాయి.