మోడి లక్ష్యం బంగారు భారత్ | Modi aims for gold in India | Sakshi
Sakshi News home page

మోడి లక్ష్యం బంగారు భారత్

Sep 18 2014 2:32 AM | Updated on Aug 15 2018 2:20 PM

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ప్రధానమంత్రి నరేంద్రమోడికి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు.

  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు
  • గన్నవరం : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ప్రధానమంత్రి నరేంద్రమోడికి మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో మోడి వందరోజుల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ మన దేశాన్ని బంగారు భారత్‌గా తీర్చిదిద్దేందుకు మోడి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు.

    సీఎం చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాలన సాగించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణతోపాటు జిల్లాల సంఖ్యను 25కు పెంచాలన్నారు. రాష్ట్రంలో జల రవాణాను పెంపొందించేందుకు, ఏపీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు  కేంద్రం సంసిద్ధంగా ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి, గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

    రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన అన్ని వ్యవస్థలను మోడి గాడిలో పెడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన మోడి దేశ ప్రధాని కావడం అందరికీ గర్వకారణమన్నారు.

    బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, కార్యవర్గ సభ్యులు మోటుపల్లి శామ్యూల్, ఆర్.రవీంద్రరాజు, మహిళా మోర్చ అధ్యక్షురాలు మాలతిరాణి, కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు తుమ్మల అంజిబాబు, నియోజకవర్గ కన్వీనర్ నాదెండ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.
     

Advertisement
 
Advertisement
Advertisement