
‘మరణించి’ బతికాడు!
గుర్తు తెలియని మృతదేహం తమ వాడిదేనని ఒక కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.
- 16 రోజుల అనంతరం కనిపించిన యువకుడు
- నెల్లూరు జిల్లాలో వింత సంఘటన
వెంకటగిరి: గుర్తు తెలియని మృతదేహం తమ వాడిదేనని ఒక కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి 16 రోజుల తరువాత అంతులేని ఆనందం లభించింది. మృతి చెందాడనుకున్న వ్యక్తి కనిపించాడు. తమ వాడు బతికే ఉన్నాడని తెలుసుకుని శనివారం రాత్రి అతడిని ఇంటికి తీసుకొచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పొక్కందల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. పొక్కందల గ్రామంలో పుల్లయ్య, పద్మమ్మ దంపతుల చిన్నకుమారుడు మురళి(29) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మురళికి భార్య మాధవి, ఏడాది వయసున్న పాప ఉన్నారు. నెల రోజుల కిందట విధుల కోసం ఇంటి నుంచి వెళ్లిన మురళి తర్వాత ఆచూకీ లేకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో గత నెల 25న సైదాపురం అటవీ ప్రాంతంలోని పల్లెమిట్ట గని గుంతలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ విషయం తెలిసిన మురళి కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహాన్ని చూశారు. మురళి శరీరంపై ఉన్న గుర్తులు మృతదేహంపై ఉన్న ఆనవాళ్లతో సరిపోలడంతో వారు హతాశులయ్యారు. మృతుడి తల కింద, పొత్తి కడుపులో ఆపరేషన్లు అయినట్లు పోస్టుమార్టంలో వైద్యులు గుర్తించారు. మురళికి ఆ భాగాల్లోనే కొన్ని ఆపరేషన్లు జరిగాయని పుల్లయ్య పోలీసులకు తెలిపారు. దీంతో ఆ మృతదేహం మురళిదే అని అందరూ నిర్ధారణకు వచ్చి గత నెల 26న అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తిచేశారు.
ఆచూకీ లభ్యం ఇలా: మండల కేంద్రమైన రాపూరుకు శనివారం శీతలపానీయాల లోడు లారీ వచ్చింది. ఆ లారీలో మురళి ఉండటాన్ని అతడి బంధువులు గమనించారు. వెంటనే వారు ఫొటో తీసి కుటుంబసభ్యులకు చేరవేశారు. కుటుంబసభ్యులు రాపూరు వెళ్లేసరికి ఆ లారీ చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఉన్న శీతలపానీయాల గోదాము వద్దకు వెళ్లింది. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి మురళిని కలుసుకున్నారు. రాత్రి ఇంటికి తీసుకుని వచ్చారు. మరోవైపు పల్లెమిట్ట గని గుంతలో లభించిన మృతదేహం ఎవరిదో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై పడింది.