
ఖనిజ విక్రయాలు బంద్
మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థలో విక్రయాలు బంద్ అయ్యాయి. గత నెల 24వ తేదీ నుంచి విక్రయాలను నిలిపివేశారు.
ఓబులవారిపల్లె, న్యూస్లైన్: మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థలో విక్రయాలు బంద్ అయ్యాయి. గత నెల 24వ తేదీ నుంచి విక్రయాలను నిలిపివేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఖనిజ విక్రయాలను నిలిపివేయాలని ప్రధాన కార్యాలయం నుంచి మంగంపేట శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఖనిజ విక్రయాన్ని పూర్తిగా నిలిపివేశారు. మంగంపేట గనుల ఆధారంగా 250 ఫల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నాయి.
ఒకొక్క మిల్లులో 50నుంచి 80మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. ఏపీఎండీసీ నుంచి మిల్లులకు ఖనిజ సరఫరా లేకపోవడంతో మిల్లులు మూతపడ్డాయి. కూలీలు కూడా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఖనిజం లేకపోవడంతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు పౌడర్ను సరఫరా చేయడంలో మిల్లు యజమానులు వ్యాపారమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఖనిజ ఉత్పత్తి లేక గతంలో మిల్లులు దీర్ఘకాలికంగా మూతపడ్డాయి. మిల్లు యజమానులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. రాష్ట్ర విభజన సాకుతో ఏపీఎండీసీ యాజమాన్యం ఖనిజ విక్రయాలు నిలిపివేయడంతో మిల్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీపీఓ కేదార్నాథ్రెడ్డిని వివరణ కోరగా ప్రస్తుతం మంగంపేటలో ఏ గ్రేడ్ ఖనిజం 57వేల మెట్రిక్ టన్నులు, బీ గ్రేడ్ 11వేల మెట్రిక్ టన్నులు, సీఅండ్డీ 44.63లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తిరిగి ఉత్తర్వులు రాగానే ఖనిజ విక్రయాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.