local authorities
-
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు: స్థానిక సంస్థలైన మండల పరిషత్, పంచాయతీల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం పాపిరెడ్డిపాళెం, తోటపల్లిగూడూరు పంచాయతీల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో కాకాణి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే స్థానిక సంస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇసుక రీచ్ల ఆదాయంలో పొదుపు సంఘాలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిందన్నారు. అయితే 25 శా తం ఆదాయాన్ని రుణమాఫీ కోసం వినియోగిస్తామననడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇసుక రీచ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని 25శాతం పొదు పు సంఘాల అభివృద్ధికి పోను మిగిలిన మొత్తాన్ని స్థానిక సంస్థలకు వినియోగించాలన్నారు. జన్మభూమి కార్యక్రమం అర్థం లేకుండా సాగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో మౌలివసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా బడి పిలుస్తోంది అంటూ మొక్కుబడి కార్యక్రమాన్ని చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా, సిబ్బందిని నియమించకుండా స్వచ్ఛాంధ్ర పేరుతో గ్రామాల్లో పారి శుధ్య కార్యక్రమాలను చేపట్టడం ఎలా సాధ్యమో పాలకులే తెలపాలన్నారు. పేదలకు భద్రత కల్పిస్తున్నామంటూనే లేని పోని సాకులు చూపి అధికారులు వేలాది మంది పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీచేశారు. తొలుత ఎమ్మెల్యే కాకాణికి ఎంపీటీసీ సభ్యుడు దద్దోలు వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయ చైర్మన్ ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, సర్పంచ్లు మన్నెం నీలిమ, మచ్చా మాధవయ్య, ఎంపీటీసీ సభ్యుడు దద్దోలు వెంకటకృష్ణయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, నాయకులు నాయుడు హేమంత్రెడ్డి, తోడేటి సుధాకర్, నెల్లూరు లక్ష్మణ్, మేనాటి రామయ్య, పెళ్లూరుశ్రీరాములు, అన్నం హరి బాబు, మన్నెం సుబ్రహ్మణ్యం, మన్నెం రాము, పాకం ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
ఖనిజ విక్రయాలు బంద్
ఓబులవారిపల్లె, న్యూస్లైన్: మంగంపేట ఖనిజాభివృద్ధి సంస్థలో విక్రయాలు బంద్ అయ్యాయి. గత నెల 24వ తేదీ నుంచి విక్రయాలను నిలిపివేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఖనిజ విక్రయాలను నిలిపివేయాలని ప్రధాన కార్యాలయం నుంచి మంగంపేట శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఖనిజ విక్రయాన్ని పూర్తిగా నిలిపివేశారు. మంగంపేట గనుల ఆధారంగా 250 ఫల్వరైజింగ్ మిల్లులు నడుస్తున్నాయి. ఒకొక్క మిల్లులో 50నుంచి 80మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. ఏపీఎండీసీ నుంచి మిల్లులకు ఖనిజ సరఫరా లేకపోవడంతో మిల్లులు మూతపడ్డాయి. కూలీలు కూడా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఖనిజం లేకపోవడంతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు పౌడర్ను సరఫరా చేయడంలో మిల్లు యజమానులు వ్యాపారమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఖనిజ ఉత్పత్తి లేక గతంలో మిల్లులు దీర్ఘకాలికంగా మూతపడ్డాయి. మిల్లు యజమానులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. రాష్ట్ర విభజన సాకుతో ఏపీఎండీసీ యాజమాన్యం ఖనిజ విక్రయాలు నిలిపివేయడంతో మిల్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై సీపీఓ కేదార్నాథ్రెడ్డిని వివరణ కోరగా ప్రస్తుతం మంగంపేటలో ఏ గ్రేడ్ ఖనిజం 57వేల మెట్రిక్ టన్నులు, బీ గ్రేడ్ 11వేల మెట్రిక్ టన్నులు, సీఅండ్డీ 44.63లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని పేర్కొన్నారు. యాజమాన్యం నుంచి తిరిగి ఉత్తర్వులు రాగానే ఖనిజ విక్రయాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల బాధ్యత ప్రత్యేకాధికారులదే
నల్లగొండ, న్యూస్లైన్: స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేనందున ప్రత్యేకాధికారులే పూర్తిస్థాయి బాధ్యత వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వర్రావు కోరారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత సమావేశానికి హాజరుకాని 14మంది ప్రత్యేకాధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని, సమాచారం అందకపోతే సదరు విభాగం బాధ్యునిపై చర్య తీసుకోవాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారులు స్థానికంగా ఉంటేనే ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో సకాలంలో డబ్బులు రావన్న అపోహ ప్రజల్లో నెలకొందని, ప్రజ ల్లోకి వెళ్లి వారి అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. లేదంటే లక్ష్య సాధన కష్టమన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో అవగాహన కల్పించేందుకు సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ వసతిగృహాలతో పాటు పాఠశాలల్లో తాగునీటి కి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలకు సంబంధించి విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ట్రాన్స్కో అధికారులతో స మన్వయం ఏర్పరుచుకొని సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. జిల్లాకు మంజూరైన 42 వేల పింఛన్లు త్వరితగతిన పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రెండో విడత రచ్చబండలో మంజూరైన రేషన్కార్డులకు ఫొటోలు సేకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వెంకట్రావ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వర్రావు, డీఆర్డీ పీడీ రాజేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.