ఉద్యోగులకు అందని వైద్యసేవలు | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు అందని వైద్యసేవలు

Published Wed, Dec 3 2014 1:45 AM

Medical services Not available to employees

 విజయనగరం ఆరోగ్యం: ఉద్యోగుల ఆరోగ్యసంరక్షణ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకం ఆరంభ శూరత్వంగా తయారైంది. పథకం అమలుకు సంబంధిం చి ప్రభుత్వం నిధులు సకాలంలో  విడుదల చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యసేవలు నిలిపివేస్తున్నాయి. పథకం ఆరంభమై ఏడాది అవుతున్నా ఇంతవరకు 100 మందికి కూడా వైద్యసేవలు అందించలేదంటే పథకం అమలు తీరు ఏవిధంగా  ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్లుల్లో కూడా ఉద్యోగులకు వైద్యసేవలు అందడం లేదు.
 
 ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకానికి 10 ఆస్పత్రులు
 ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం కోసం తిరుమల ఆస్పత్రి, పుష్పగిరి ఆస్పత్రి, సాయి ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రి, ఘోషాఆస్పత్రి, వెంకటపద్మ. కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఎస్.కోట సీహెచ్‌సీ, కొలపర్తి ఆస్పత్రిలను ఎంపిక చేశారు. జిల్లాలో 20వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 10 వేల మంది ఉన్నారు. అయితే  అధికశాతం మందికి ఇంకా హెల్త్ కార్డులు మంజూరు కాలేదు. కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం సంశయిస్తోంది.
 
  కార్డులు ఉన్న వారికీ వైద్యం కోసం విడుదల కాని నిధులు
 కార్డులు ఉండి వైద్యం చేయించుకోవాలనుకున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నిధులను సకాలంలో ఇవ్వకపోవడంతో  నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యాన్ని నిలిపివేస్తున్నాయి. దీంతో  ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఏడాది నవంబర్‌లో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 10 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఇంతవరకు కేవలం 47 మంది మాత్రమే ఈ పథకం ద్వారా వైద్య ంపొందారు.

Advertisement
Advertisement