మావోయిస్టులు పిలుపు నిచ్చిన ఏఓబీ బంద్ హింసాత్మకంగా మారింది.
- ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు
మావోయిస్టులు పిలుపు నిచ్చిన ఏఓబీ బంద్ హింసాత్మకంగా మారింది. మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. మృతులు చిత్రకొండ ప్రాంతానికి చెందిన సర్పంచ్లు జయరామ్కొర, సాదుమ్కొరలుగా పోలీసులు గుర్తించారు. అయితే, దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
కాగా..: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిపాలనే ప్రభుత్వ నిర్ణయంపై మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కూంబింగ్లు, తనిఖీలతో అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. దుకాణాలను వ్యాపారులు మూసేశారు. అయితే, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని దుకాణాలను పోలీసులు తెరిచిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.