అసలేం జరిగింది?

Many suspicions in the Medical student Harsha Praneeth Reddy Death - Sakshi

వైద్యవిద్యార్థి గదిలో విరిగిన మంచం, చెల్లాచెదురుగా వస్తువులు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కళాశాలలో వైద్యవిద్యార్థి హర్షప్రణీత్‌రెడ్డి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అతను ఉండే హాస్టల్‌ గదిలో చెల్లాచెదురుగా పడిన వస్తువులను చూస్తే ఎవరికైనా ఈ అనుమానాలు తలెత్తడం ఖాయం. గురువారం హర్షప్రణీత్‌రెడ్డి గదిలోకి వెళ్లి లోపల గడియ పెట్టుకోకముందు జరిగిన ఘటనలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హర్ష ఆ రోజు ఎవరికి ఎక్కువసార్లు ఫోన్‌ చేశాడు? చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడాడు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

ఈ మేరకు అతని సెల్‌ఫోన్‌లో డేటాను పరిశీలిస్తున్నారు. ఆ విద్యార్థి ఎక్కువగా చాటింగ్‌ చేసేవాడని, ఎప్పటికప్పుడు మెసేజ్‌లను డిలిట్‌ చేసేవాడని చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. డిలిట్‌ చేసిన మెసేజ్‌లను తెలుసుకునేందుకు, కాల్‌ డేటాను తెప్పించేందుకు చర్యలు ప్రారంభించారు. హర్ష మృతిచెందిన గదిలో ఇనుప మంచం పూర్తిగా వంగిపోయి ఉంది. దానిపైన ఉండే పరుపు చెల్లాచెదురుగా పడి ఉంది. ఫ్యాన్‌కు సైతం రెండు, మూడు టవళ్లు వేలాడుతూ ఉన్నాయి. దీన్ని బట్టి అతని మృతికి ముందే గదిలో ఏదైనా గొడవ జరిగిందా? అన్న అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది. మొత్తంగా హర్ష సెల్‌ఫోన్‌ డేటా, మెసేజ్‌ల వివరాలు తెలిస్తే గానీ మృతికి గల కారణాలు తెలిసే పరిస్థితి లేదని పలువురు వైద్యులు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top