మళ్లీ అలిగిన మాగంటి | maganti babu disappointed | Sakshi
Sakshi News home page

మళ్లీ అలిగిన మాగంటి

Apr 14 2016 11:12 AM | Updated on Aug 10 2018 7:07 PM

ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా అలక వహించారు.

ఏలూరు : ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా అలక వహించారు. సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది.
 
 దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. గతంలోనూ ఇలాగే అలిగి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన్ను బతిమాలి తీసుకొచ్చేవారు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎం వేదికపైకి వచ్చిన తర్వాత కూడా మాగంటి బాబు వేదికపైకి రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. సభాధ్యక్ష బాధ్యతను పోలవరం ఎమ్మెల్యే మొడియం  శ్రీనివాసరావు తీసుకుని కార్యక్రమాన్ని ముగించారు.
 
 సీఎంలో ఎందుకో నిస్తేజం
 ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించేవారు. కానీ బుధవారం నాటి పర్యటనలో ఒకింత నిస్తేజంగా కనిపించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్దగా జనం లేకున్నా గంటకుపైగా మాట్లాడే చంద్రబాబు మండుటెండలో సైతం భారీగా జనాన్ని సమీకరించినప్పటికీ.. మొక్కుబడిగానే మాట్లాడి ముగించేయడం టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement