కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్ | Kiran Kumar Reddy and Chandrababu Naidu open Your Eyes: YS Jagan | Sakshi
Sakshi News home page

కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్

Oct 17 2013 3:49 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్ - Sakshi

కిరణ్, చంద్రబాబు కళ్లు తెరవాలి: జగన్

సమైక్య రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు.

హైదరాబాద్: సమైక్య రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేశారు. తన నివాసం లోటస్పాండ్లో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకోకపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్రం ఎడారి అవుతుందని హెచ్చరించారు. చదువుకున్నవారు హైదరాబాద్ వస్తే ప్రతి పిల్లవాడు చంద్రబాబును, కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టేపరిస్థితి వస్తుందన్నారు.  కేబినెట్ నోట్ తయారు కాకముందే శాసనసభను సమావేశపరిచి సమైక్యరాష్ట్రం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. ఈరోజు తాము మరోసారి గవర్నర్ నరసింహన్ను కలిసినట్లు చెప్పారు. శాసనసభను సమావేశపరచమని కోరినట్లు తెలిపారు. కేబినెట్‌ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచి,  సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఇదివరకే కోరామని చెప్పారు. కానీ తమ రోదన అరణ్యరోదనే అయిందన్నారు.

చంద్రబాబు ఢిల్లీ వెళతారు. విభజించండి అని నిరాహార దీక్ష చేస్తారు. ఈ పేరుతో ఆయన అక్కడ ఎంతమందిని కలిశారో తెలియదన్నారు. ఇది మన ఖర్మ అన్నారు. అదే సమయంలో ఇక్క డ కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలను ఒక్కొక్కరిని కలుస్తారు. వారిని బెదిరించి సమ్మె విరమించే ప్రయత్నాలు చేస్తారు. మొన్నటిదాకా సమైక్యత అన్న కేంద్ర మంత్రులు, ఎంపిలు ఇప్పుడు ప్యాకేజీలు అడిగే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఉద్యమాన్ని వీరు ఎందుకు  నీరు గారుస్తున్నారో అర్ధం కావడంలేదంటున్నారు.  వీళ్ల తీరు చూస్తుంటే.. వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోందన్నారు. సోనియాకు దిగ్విజయ్‌ సింగ్ కుడి భుజమైతే, కిరణ్‌ ఎడమ భుజం అన్నారు. సమైక్య ఉద్యమం తగ్గిపోయిందని ఒకవైపు దిగ్విజయ్‌ అంటారు, మరోవైపు ఉద్యమం నుంచి ఒక్కొక్కరినీ తప్పించేలా కిరణ్‌ వ్యవహరిస్తారని విమర్శించారు.

యూపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తనకు కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడ్డారని విమర్శించారు. ఆమె మన అందరి పిల్లల జీవితాతో ఆడుకుంటున్నారన్నారు.  చంద్రబాబు అడ్డగోలుగా  ఆమెకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.  సోనియాకు కావలసిన విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఎంత చెబితే అంతే. ఆమె చెప్పిన విధంగా చేస్తారని చెప్పారు. కిరణ్, చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని కోరారు. కలిసిరండని విజ్ఞప్తి చేశారు. సమైక్యతకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం  మూడు పార్టీలని తెలిపారు. ఇప్పటికై చంద్రబాబు సిగ్గుతెచ్చుకొని ఈ మూడు పార్టీలతో కలవాలని పిలుపు ఇచ్చారు. ఆ మూడు నాలుగు, అయిదు పార్టీలు  అవ్వాలని  అన్నారు.

ఈ నెల 26న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యమ బాటను ఉద్ధృతం చేస్తాం, చివరిదాకా పోరాడుతామని చెప్పారు. సమైక్య శంఖారావానికి ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామన్నారు.  రేపు సిఎం ఇంటి వద్ద తమ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తారని చెప్పారు. స్పీకర్ను కలుస్తారన్నారు.  సమైక్యత అంటే మూడు ప్రాంతాలను కలిపి ఉంచాలి. సమైక్యం అంటే అందులో తెలంగాణ ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, కోస్తాంధ్ర ఉంటుంది అని వివరించారు. 3 ప్రాంతాలకూ న్యాయం జరిగేలా తాను ముదుంటానని చెప్పారు. అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను పూర్తిగా పక్కననపెట్టమని సలహా ఇచ్చారు. వ్యవస్థల్లో నిజాయితీని తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తమ రాజీనామాలు, తమ పార్టీలో చేరినవారి రాజీనామాలు  ఆమోదింపజేసుకుంటామని చెప్పారు. రేపు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డితో తాను మరో లేఖను పంపిస్తున్నానన్నారు. కోర్టు అడ్డంకుల వల్ల ఢిల్లీకి రాలేకపోయానని, రాజీనామాను ఆమోదించాలని అందులో కోరతానని చెప్పారు.   ఎంపి లగడపాటి రాజగోపాల్ ఏదో అన్నారని తాను మాట్లాడటం మొదలు పెడితే బాగుండదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement