సాక్షి, హైదరాబాద్: టీడీపీ-బీజేపీల మధ్య పొత్తంటూ కుదిరితే అది నీతి, నిజాయితీ లేనిదే అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. అవకాశవాదంతో కూడిన టీడీపీ... మతోన్మాదాన్ని పుణికిపుచ్చుకున్న బీజేపీ ఒక వేదిక మీదకు వస్తే ప్రజలకు అంతకుమించిన విషాదం ఉండబోదని దుయ్యబట్టారు. పార్టీ నేతలు పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలసి ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కాపాడడానికి కిషన్రెడ్డి సిద్ధమైనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యవహారంలో బీజేపీ నయవంచకపాత్ర పోషిస్తోందన్నారు. బీజేపీ నేతలు ప్రాంతాల వారీగా విడిపోయి రాష్ట్రపతిని కలవడం, రెండు వేర్వేరు నివేదికలు పార్టీ జాతీయ నాయకత్వానికి ఇవ్వడమే నయవంచక పాత్రకు నిదర్శనంగా అభివర్ణించారు.