ఆ వ్యత్యాసాలెందుకు? | JUNTU High command | Sakshi
Sakshi News home page

ఆ వ్యత్యాసాలెందుకు?

Feb 7 2015 6:17 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..?

  • పూర్తి వివరాలను మా ముందుంచండి
  • జేఎన్‌టీయూకు హైకోర్టు ఆదేశం
  • సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని సౌకర్యాలు ఏఐసీటీఈ, పీసీఐ నిబంధనల మేరకు ఉన్నాయో..? లేదో..? తేల్చేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ సమర్పించిన నివేదికలోని వివరాలతో జేఎన్‌టీయూ (హైదరాబాద్) సమర్పించిన నివేదిక వివరాలు సరిపోలకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జేఎన్‌టీయూను ఆదేశించింది.
     
    ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని జేఎన్‌టీయూ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), భారతీయ ఫార్మసీ మండలి (పీసీఐ) నిర్ధేశించిన నిబంధనల మేరకు 143 ఇంజనీరింగ్, 7 ఫార్మసీ కాలేజీల్లో సరైన సదుపాయాలు లేవని, ఆ కాలేజీల్లో భారీ లోపాలున్నాయని, అందువల్ల వాటికి అఫిలియేషన్‌ను నిరాకరిస్తున్నట్లు పేర్కొంటూ జేఎన్‌టీయూ గత నెల 29న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీన్ని సవాల్‌చేస్తూ కాలేజీలు గురువారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement