భూ కబ్జాలు కేరాఫ్‌ గంటా | Janasena Leader Counter On Ganta Srinivasa Rao In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భూ కబ్జాలు కేరాఫ్‌ గంటా

Jul 13 2018 9:16 AM | Updated on Jul 6 2019 3:48 PM

Janasena Leader Counter On Ganta Srinivasa Rao In Visakhapatnam - Sakshi

మాట్లాడుతున్న శివశంకర్‌

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు టీడీపీ నాయకుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు వేసిన 25 ప్రశ్నలకు సమాధానం చెబుతాం ..  ముందు మేమడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనసేన ఉత్తరాంధ్ర అధ్యక్షుడు శివశంకర్‌ ప్రశ్నించారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  పవన్‌ ఇమేజ్‌ దెబ్బతీయడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. వపన్‌పై విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాలుగేళ్ల కాలం పట్టిందా? అని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు పార్టీలు మారే  మంత్రి గంటాకు నీతి నిజాయతీ గల పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే నైతికత  లేదని విరుచుకుపడ్డారు. ఎవరిమీదైనా బురద జల్లడం ఒక్క టీడీపీకే చెందిందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై మీరు మాట్లాడే తీరు నిసిగ్గుగా ఉందన్నారు. ఉత్తరాంధ్రపై మీకు అభిమానం ఉంటే..కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్లు వెనక్కి వెళ్లిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగేళ్లుగా ముంచిన చంద్రబాబు కానీ, విశాఖ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన గంటా కానీ జనసేనాను ఏ విధంగా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు.
 
భూ కబ్జాలు కేరాఫ్‌ గంటా

విశాఖ రూరల్‌ మండల పరిధిలోని పరదేశిపాలెం, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, రుషికొండ, చినగదిలి,   భీమునిపట్నం ప్రాంతాల్లో భూ కబ్జాలకు గంటా కేరాఫ్‌గా నిలిచారన్నారు. మాజీ సైనిక ఉద్యోగులను బెదిరించి భూములను చౌకగా లాక్కున విషయం నిజం కాదా? చివరికి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కూడా వదలకుండా కబ్జాలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ బంధువు షాడో మంత్రిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోవడం నిజం కాదా? తహసీల్దార్‌ డిజిటల్‌ కీ దుర్వినియోగం చేసి రికార్డులను మాయం చేయించిన మీరు పవన్‌కు ప్రశ్నలు సంధించే అర్హత లేదన్నారు.

మీ సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా విశాఖలో 6వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ఒప్పుకోవడం వాస్తవం కాదా? పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్‌ విషయంలో మీ వియ్యంకుడు నారాయణకు మీరు సహకరించలేదా? బీఈడీ, ఎయిడెడ్‌ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో మీ భార్య, ఆమె సోదరుడు సుమారు 900 మంది నుంచి లక్షలు వసూళ్లు చేయడం నిజం కాదా? కోరుకున్న చోటకే పోస్టింగ్‌ కోసం లక్షలు లంచాలు తీసుకోవడం నిజం కాదా? అని నిలదీశారు. హోదాపై పోరాటంలో ఎవరికి చిత్తశుద్ధి ఉందో బహిరంగ చర్చకు సిద్ధమా?  అని శివశంకర్‌ సవాల్‌ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement