రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకునే పరిణామాలను రోజువారీగా నివేదించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకునే పరిణామాలను రోజువారీగా నివేదించాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ గురువారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నప్పటికి పరిణామాలు, శాంతి భద్రతల పరిస్థితిపై ఐబీ నుంచి కూడా నివేదిక కావాలని హోంశాఖ కోరడం గమనార్హం.
తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రకు సంబంధించి మూడు వేర్వేరు నివేదికలతో పాటు, ఒక సంయుక్త నివేదికను కేంద్ర హోంశాఖకు అందచేసేలా ఐబీ ఏర్పాట్లను చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేకించి ఐబీలో ఒక సెల్ను ఏర్పాటు చేసి దానికి అవసరమైన వాహనాలు, ఇతర సదుపాయాలను కూడా కల్పించినట్లు తెలిసింది. వీరు ప్రతి రోజు రాత్రి రాష్ట్రంలో పరిస్థితిపై నివేదికను కేంద్ర హోంశాఖకు పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు.