వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం


మహబూబ్‌నగర్ కల్చరల్/ విద్యావిభాగం, న్యూస్‌లైన్: స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో వివేకానంద 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులందరూ వివేకానందుని సందేశాలను విన్నంత మాత్రాన సరిపోదని వాటిని ఆచరించాలని సూచించారు.

 

 విద్యార్థులు ధైర్యంగా ఉండి సంఘసేవ చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తేజితులను చేయడం ద్వారానే జాతి భద్రంగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని కలెక్టర్ గుర్తు చేశారు. ధైర్యంగా జీవించడం, బలాన్ని గురించి ఆలోచించడమే బలహీనతకు మంద ని, బలమే ప్రాణం-బలహీనతే మరణమనేవి స్వామిజీ సందేశాల్లో ప్రధానమైనవన్నారు. సెలవు రోజుల్లో ఒక గంటపాటు విద్యార్థులను సమీకరించి, వారిచే వివేకానందుడి గురించి మాట్లాడించాలని, తద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు.

 

 రామకృష్ణమఠం ప్రతినిధి నియమ చైతన్యనంద మాట్లాడుతూ నిస్వార్థం, ప్రేమ, ధైర్యం, త్యాగం సేవాగుణం అలవర్చుకుంటే గొప్ప వ్యక్తులు అవుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసించి దేశపురోభివృద్ధికి తోడ్పడాలన్నారు. రక్తదాన శిబిరంలో 150మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ లయన్ నటరాజ్, జేపీఎన్‌ఈఎస్ చైర్మన్ రవికుమార్, కళాశాల కరస్పాండెంట్  ఫణిప్రసాద్‌రావు, డెరైక్టర్ సయ్యద్ ఇబ్రహీం ఖలీల్, ప్రిన్సిపల్ విఠల్‌రావు, కె.సత్యనారాయణరావు, డాక్టర్ వీరప్ప తదితరులు పాల్గొన్నారు.

 

 దేశభక్తిని పెంపొందించారు

 చిన్నచింతకుంట: ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు స్వామి వివేకానందుడు ఎంతో కృషి చేశారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరెస్సెస్ వక్త అమరలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వామిజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. యువత కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని సూచించారు. వివేకానంద కలలుగన్నా దేశాన్ని స్థాపించాలన్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. గ్రామంలో స్వామిజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే స్వామి వివేకానంద సిద్ధాంతమని, అన్ని మతాల సారాంశాన్ని గుర్తించి గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, టీ.వేణుగోపాల్, సిద్దార్థారెడ్డి, సర్పంచ్ శారద, మార్కెట్ చైర్మన్ అరవింద్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కుర్వ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top