‘ఖర్మా'గారాలపై కొరడా! | industries on fire the wmployess | Sakshi
Sakshi News home page

‘ఖర్మా'గారాలపై కొరడా!

Jul 9 2014 3:29 AM | Updated on Sep 2 2017 10:00 AM

జిల్లాలో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి.

విశాఖ రూరల్ : జిల్లాలో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఉద్యోగుల ఉసురు తీస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ఆధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చే సుకోకపోవడం.. ప్రమాదాలు సంభవించినా కఠినంగా శిక్షించే స్థాయిలో పరిశ్రమ చట్టాలు లేకపోవడంతో ప్రమాదాల నియంత్రణకు అవకాశం లేకుండా పోతోంది.

కనీసం పరిశ్రమల్లో ప్రమాణాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ కూడా లేకపోవడం గమనార్హం. ఈ మధ్య కాలంలో జిల్లాలో 10 పారిశ్రామిక ప్రమాదాలు సంభవించాయి.  దీంతో కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రమాదాల నియంత్రణకు కమిటీల ఏర్పాటు, పరిశ్రమల చట్టాల సవరణకు ప్రతిపాదనలు, సిఫార్సులు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు.

ఈ ప్రమాదాలపై త్వరలోనే జిల్లాలో సంబంధిత మంత్రులు, రాష్ర్ట స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు, ఇక్కడ పరిశ్రమల్లో ఉన్న సెఫ్టీ ఆడిట్ సిస్టమ్, ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలు, వాటిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులకు వివరించనున్నారు.
 
జిల్లా స్థాయి కమిటీకి ప్రతిపాదనలు
జిల్లాలో ఉన్న పరిశ్రమల తీరుతెన్నుల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ లేదు. పరిశ్రమల చట్టం ప్రకారం ఇటువంటి కమిటీ ఏర్పాటుకు వెసులుబాటు లేదు. పరిశ్రమల చట్టంలో కొన్ని సవరణలు చేయడం ద్వారా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు కూడా మార్గం సుగమం అవుతుందని కలెక్టర్ భావిస్తున్నారు.

దీనిపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్ సేఫ్టీ ఆడిట్ సిస్టమ్‌ను తయారు చేసేందుకు పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్‌లో పరిశ్రమల పాలసీలను అధ్యయనం చేసి తదనుగుణంగా ఇక్కడ మార్పులు చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు.
 
36 సంస్థలకు ఎన్‌ఓసీ లేదు

పరవాడలోని ఫార్మాసిటీలో 65 పరిశ్రమలు ఉండగా అందులో 36 కంపెనీలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో 25 కంపెనీల వారు ఎన్‌ఓసీ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల వారికి ఎన్‌ఓసీలు జారీ చేయలేదు.

మరో 11 కంపెనీలు ఎన్‌ఓసీ కోసం కనీసం దరఖాస్తు కూడా చే యలేదు. దీంతో ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాంకీ ఫార్మాలో హైడ్రాలిక్ ప్లాట్‌ఫారం, డ్రై కెమికల్ పౌడర్, ఫోమ్ టెండర్‌లు ఏర్పాటు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

నేషనల్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూషన్ కోసం ప్రతిపాదనలు
కొన్ని పరిశ్రమల్లో నిపుణులైన ఉద్యోగులు లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో జిల్లాలో పరిశ్రమల అవసరాలకు తగిన నిపుణులను తయారు చేసేందుకు వీలుగా నేషనల్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

ఈ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు వారికి శిక్షణతో పాటు ప్రమాదాల నివారణకు, పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టి భద్రతా ప్రమాణాలు చేపట్టేలా యాజామాన్యాలకు సూచనలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement